Saturday, October 19, 2024

India vs Kiwis – స‌ర్ఫ‌రాజ్ సూప‌ర్ శ‌త‌కం..

భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తొలి శ‌త‌కం బాదేశాడు. కివీస్‌తో బెంగ‌ళూరు వేదిక‌గా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 110 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. నాలుగో టెస్టులోనే తొలి శతకం పూర్తి చేయడం విశేషం. ఓవర్‌నైట్‌ 70 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సర్ఫరాజ్‌ ఏదశలోనూ తడబాటుకు గురికాలేదు. చూడచక్కని షాట్లతో అలరించాడు. ఆఫ్‌సైడ్ లేట్ కట్టర్లతో బౌండరీలు రాబట్టాడు.


రిషభ్‌ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేయగా.. భారత్ 46 రన్స్‌కే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 356 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (70)తో కలిసి సర్ఫరాజ్‌ ఖాన్ దూకుడుగా ఆడాడు. కివీస్‌ పేస్, స్పిన్‌ను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆడటం తీవ్ర ఒత్తిడితో కూడుకున్నదే. అయినాసరే ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్ఫరాజ్ పరుగులు రాబట్టడం విశేషం.

పంత్‌ వచ్చేశాడు.. నిలకడగా ఆడేస్తున్నాడు

రెండో రోజు వికెట్ కీపింగ్‌ చేస్తుండగా.. మోకాలిపై నేరుగా బంతి పడటంతో నొప్పితో మైదానం వీడిన రిషభ్‌ పంత్ మూడో రోజు కీపింగ్‌ చేయలేదు. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వస్తాడా? లేదా? అనేది సందిగ్ధత నెలకొంది. కానీ, నిన్న మ్యాచ్‌ ముగిసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా కనిపించాడు. దీంతో నాలుగో రోజు సర్ఫరాజ్‌తో కలిసి క్రీజ్‌లోకి పంత్ రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వీరిద్దరూ ఇప్పటికే హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు. అయితే, ఇన్నింగ్స్‌ 56వ ఓవర్‌లో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి పంత్ బయటపడ్డాడు.

- Advertisement -


ప్రస్తుతం భారత్‌ 71 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 344 రన్స్ చేసింది. ఇంకా 12 పరుగులు వెనకబడి ఉంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (125), రిషబ్ పంత్‌ (53) క్రీజులో ఉన్నారు. నాలుగోరోజు ఆటలో సర్ఫరాజ్‌ 55 రన్స్ చేయగా.. పంత్‌ 53 రన్స్ చేశారు. ఈ ఇద్దరు కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో సెషన్‌లో కూడా సర్ఫరాజ్‌, పంత్‌ ఇలానే ఆడితే.. టీమిండియా మంచి ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 46 రన్స్.. న్యూజిలాండ్‌ 402 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement