Sunday, September 8, 2024

నేడే ఆసీస్‌తో చివరి వన్డే – వైట్‌వాష్‌ పై గురి

రాజ్‌కోట్‌: ఇప్పటికే సిరీస్‌ని కైవసం చేసుకున్న టీమిండియా చివరి వన్డేలోనూ గెలిచి ఆస్ట్రేలియాను వైట్‌వాష్‌ చేయాలని భావిస్తోంది. ఆసీస్‌పై వరుసగా రెండు విజయాలు సాధించిన భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. బుధవారం రాజ్‌కోట్‌ వేదికగా జరిగే నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. తొలి రెండు వన్డేల్లో విశ్రాంతిలో ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లీ, కుల్దిdప్‌ యాదవ్‌లు మళ్లి భారత జట్టులో కలవనున్నారని తెలుస్తోంది. రెండో మ్యాచ్‌కు దూరమైన బుమ్రా కూడా మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో కనిపించాడు. ప్రపంచకప్‌-2023కు ముందు ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో మెగా సమరంలో అడుగుపెట్టాలని రోహిత్‌ సేన భావిస్తోంది.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ శుభ్‌మాన్‌ గిల్‌, మహ్మద్‌ షమీ, శార్దుల్‌ ఠాకుర్‌లకు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అలాగే గాయం నుంచి ఇంకా కోలుకొని అక్షర్‌ పటేల్‌ స్థానంలో రవీచంద్రన్‌ అశ్విన్‌ కొనసాగనున్నాడు. ప్రపంచకప్‌ జట్టులో మార్పుల కోసం చివరి తేది సెప్టెంబర్‌ 28 కావడంతో అప్పటీవరకు అక్షర్‌ పటేల్‌ కోలుకొని పూర్తి స్థాయిలో ఫిట్‌నేస్‌ సాధించడం కష్టమే. అందుకే ప్రపంచకప్‌లో జట్టులోనూ అశ్విన్‌ ప్లేస్‌ ఖాయమనిపిస్తోంది.జోరు కొనసాగాలి..గత రెండు వన్డేల్లో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన భారత బ్యాటర్లు చివరి మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని ఆతృతగా ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో సీనియర్లు రోహిత్‌, కోహ్లీలు కూడా జతవడంతో బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై భారత్‌ మరోసారి పరుగుల వదర పారించడం ఖాయమనిపిస్తోంది. ఇక దైపాక్షిక సిరీస్‌లో ఆసీస్‌పై ఇప్పటి వరకు వైట్‌వాష్‌ చేయని టీమిండియాకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఇక గత మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ మళ్లిd ఫామ్‌ను అందుకున్నాడు. అద్భుత శతకంతో సత్తా చాటుకోగా.. వన్డేల్లో వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో తిరిగి గాడిలో పడ్డాడని చేప్పాలి. ఇక గాయం నుంచి ఆసియాకప్‌కు దూరమైన భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆసీస్‌ సిరీస్‌లో అదరగొడుతున్నాడు. మొత్తంగా ప్రపంచకప్‌కి ముందు బ్యాటింగ్‌లో టీమిండియా పటిష్టంగా మారడం శుభసూచికం.

ఇక బౌలింగ్‌లో పేస్‌, స్పిన్‌ రెండు విభాగాల్లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. రెండో వన్డేలో అశ్విన్‌, జడేజాలు ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. అలాగే తొలి మ్యాచ్‌లో పేసర్లు షమీ, ప్రసిద్ధ్‌ కృష్ణలు గొప్పగా రాణించారు.

- Advertisement -

.ఆసీస్‌కు ఊరట..

తొలి రెండు వన్డేలకు దూరమైన ఆసీస్‌ స్టార్‌ ఆటగాళ్లు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మిచెల్‌ స్టార్క్‌లు చివరి వన్డేకు అందుబాటులోకి రావడం ఆసీస్‌కు ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం వీరిద్దరూ గాయాలనుంచి పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు. ఆసీస్‌ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో ఘోరంగా విఫలమవుతోంది. డేవిడ్‌ వార్నర్‌ ఒక్కడే పర్వాలేదనిపించినా మిగతా ఆటగాళ్లు స్థాయికి తగ్గా ప్రదర్శన చేయకపోవడం ఆసీస్‌కు కలవరపెడుతోంది. ఆసీస్‌కు ఇది వరుసగా 5వ ఓటమి. భారత్‌తో తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఆసీస్‌.. అంతకుముందు దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయింది.

ప్రపంచకప్‌కు ముందు చెత్త ప్రదర్శనలు చేస్తుండటంతో ఆసీస్‌ జట్టుపై మాజీలు, అభిమానులు మండిపడుతున్నారు. అయితే చివరి మ్యాచ్‌లోనైన అత్యుత్తమ ప్రదర్శన చేసి పరువు దక్కించుకోవాలని కంగారు జట్టు భావిస్తోంది.

భారత జట్టు (అంచనా): రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, ఆర్‌. అశ్విన్‌, కుల్దిdప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా.

ఆస్ట్రేలియా జట్టు (అంచనా): పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌, స్టీవెన్‌ స్మిత్‌, మర్నూస్‌ లబూస్‌చగ్నే, అలెక్స్‌ కారే (వికెట్‌ కీపర్‌), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడమ్‌ జంపా, జోష్‌ హాజిల్‌వుడ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement