Thursday, September 19, 2024

Asian Champions | భారత్ జైత్ర‌యాత్ర‌… సెమీస్‌కు హర్మన్‌ప్రీత్ సేన !

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు వరుస విజయాల‌తో జైత్ర‌యాత్ర కొనసాగుతోంది. చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో భారత జ‌ట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈరోజు (గురువారం) దక్షిణ కొరియాతో జ‌రిగిన మ్యాచ్ లో.. 3-1 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో భారత జట్టుకు ఇది వరుసగా నాలుగో విజయం.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రెండు గోల్స్‌తో విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే భారత్ ఖాతా తెరిచింది మాత్రం అరైజీత్ సింగ్ హుందాల్. మ్యాచ్ ప్రారంభమైన 8వ నిమిషంలోనే గోల్ సాధించి సత్తాచాటాడు. ఆత‌రువాత‌ ఒక్క నిమిషం వ్యవధిలోనే హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ కొట్టి భారత్ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఇక‌ 43వ నిమిషంలో హర్మన్ మరో గోల్ సాధించాడు. మరోవైపు ప్రత్యర్థి జట్టు 30 నిమిషంలో ఖాతా తెరిచింది. జిహున్ యాంగ్ పెనాల్టీ కార్నర్ మీదుగా గోల్ కొట్టాడు. కాగా, భారత్‌ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో శనివారం తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement