జింబాబ్వే-భారత్ మధ్య నేడు జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు చెలరేగింది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా… జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో2 వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించింది.
కెప్టెన్ శుభ్మన్ గిల్ 2 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత ఓపెనర్ అభిషేక్ శర్మ-రుతురాజ్ గైక్వాడ్ భాగస్వామ్యంలో (137 పరుగులతో) జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేశారు. నిన్నటి మ్యాచ్ లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ (100) సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్… తర్వాతి 13 బంతుల్లో 47 పరుగులు బాది సెంచరీతో అదరగొట్టాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ (48 నాటౌట్)… రుతురాజ్ గైక్వాడ్ (77 నాటౌట్)తో కలిసి బౌండరీల మోత మోగించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 87 పరుగులు జోడించారు. దీంతో జింబాబ్వే ముందు బారత జట్టు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.