దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. డిసెంబర్లో 64.08 లక్షల మందితో పోల్చుకుంటే జనవరిలో ప్రయాణికుల సంఖ్య 95.72 శాతం పెరిగి 1.25 కోట్లకు చేరుకుంది. వివిధ విమానయాన సంస్థల విమానాల్లో అక్యూపెన్సీ రేషియో 80 నుంచి 90 శాతం వరకు ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ప్రారంభమైన అకాశ ఎయిర్ విమానాలు జనవరిలో 82.8 శాతం అక్యూపెన్సీతో నడిచాయి. స్పెస్ జెట్ విమానాలు 91శాతం, ఇండిగో విమానాలు 82 శాతం, ఎయిర్ ఇండియా విమానాలు 87.5 శాతం, గో ఫస్ట్ విమానాలు 90.9 శాతం అక్యూపెన్సీతో నడిచాయి.
విమానయాన రంగం దేశంలో కోవిడ్కు ముందు నాటి స్థితికి చేరిందనడానికి ఈ లెక్కలే ఉదాహరణ అని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాపడుతున్నారు. కొన్ని నెలలుగా దేశీయ విమాన సర్వీసులు అత్యధిక ప్యాసింజర్లలో నడుస్తున్నాయి. సాధారణంగా రోజువారి 4 లక్షల కంటే ఎక్కువ మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. దీని వల్లే డిసెంబర్లో అనేక ప్రధానమైన ఎయిర్పోర్టుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. ఢిల్లి ఎయిర్పోర్టులో కనీసం చెక్ఇన్ అయ్యేందుకు కూడా రెండు నుంచి 4 గంటల సమయం తీసుకుందంటేనే రద్దీ ఏమేరకు నెలకొందో అర్ధమవుతుందని ఈ రంగంలోని నిపుణులు పేర్కొన్నారు.