Friday, September 20, 2024

TG | గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భారీ బందోబస్తు

త్వరలో ప్రారంభం కానున్న గణేష్ వేడుకలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో రాచకొండ సీపీ సుధీర్ బాబు సమన్వయ సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో గణేశ్ ఉత్సవ నిర్వాహకులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

గణేష్ మండపాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని.. సీపీ స్పష్టం చేశారు. గణేష్ మండపంలో రోజంతా వాలంటీర్లు తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలని.. రాత్రి సమయంలో కనీసం ముగ్గురు ఉండేలా చూసుకోవాలని తెలిపారు.

భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకుని మండపాలలో క్యూలైన్లను ఏర్పాటు చేసేలా నిర్వహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వొద్దని సీపీ సూచించారు. ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని.. ప్రశాంతమైన వాతవరణంలో వేడుకలు జరిగేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు.

గణేష్ విగ్రహాల ఏర్పాటుతో పాటు నిమజ్జనం.. ప్రణాళిక ప్రకారం జరిగేలా, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని పోలీసు శాఖ కృషి చేస్తోందని.. అందుకు కమిటీల నిర్వాహకులు కూడా సహకరించాలని సీపీ సూచించారు. సమీపంలో ఉన్న చెరువు లేదా కుంటల లోతును బట్టి విగ్రహాల ఎత్తును నిర్ణయించి ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. నిమజ్జనోత్సవానికి అవసరమైన పోలీస్ బందోబస్తు, స్విమర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్ల నిర్వహణ, భద్రతకు సంబంధించిన రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, నీటి పారుదల శాఖ, వైద్య శాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

- Advertisement -

అవసరమైన మేరకు అన్ని శాఖల అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన బుక్ లెట్లను త్వరలోనే గణేశ్ ఉత్సవ నిర్వాహకులకు అందిస్తామని పేర్కొన్నారు. వీరందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా జరుపుకునేలా చూడాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement