Wednesday, October 9, 2024

TG | ట్యాంక్‌ బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు : సీఎస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ట్యాంక్‌ బండ్‌పై దాదాపు పదివేల మంది మహిళలతో ఈనెల 10న సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.

ఈనెల‌ 10న నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్‌ అధికారులు హాజరైన ఈ సమావేశంలో సీఎస్‌ మాట్లాడుతూ.. 10న సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్‌ బండ్‌పైకి చేరుకుంటారని అన్నారు.

వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఈ సందర్బంగా బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్‌ లనుండి ప్రత్యేకంగా ఫైర్‌ వర్క్స్‌, లేజర్‌ షోల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.

ట్యాంక్‌ బండ్‌పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుండి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో వారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా, ట్యాంక్‌ బండ్‌ చిల్డ్రన్స్‌ పార్క్‌లోఉన్న బతుకమ్మ ఘాట్‌తో పాటు నెక్లెస్‌ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ ఎంసీ అధికారులను కోరారు.

సాయంత్రం 5 .30 నుండి 7 .30 గంటల మధ్య ట్యాంకు బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ డైవర్షన్‌, బారికేడింగ్‌, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement