Monday, October 7, 2024

TG | సింగరేణికి గుడ్ న్యూస్.. బొగ్గు తవ్వకాలకు సహకరిస్తాం : ఒడిశా సీఎం

ఒడిశాలోని నైనీ వద్ద సింగరేణి సంస్థ చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తికి ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించారు. బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు.

నైనీ బ్లాక్‌లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరెందుకు శుక్రవారం భట్టి విక్రమార్క.. అధికారుల బృందంతో కలిసి ఒడిశా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఒడిశా ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం భట్టి.. సింగరేణికి బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను వివరించారు.

2017లోనే సింగరేణికి నైనీ గనులను కేటాయించారని తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి తాడిచర్ల బ్లాక్, నైనీ బ్లాక్‌లకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు వివరించారు.

అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్‌లో ఉందని, ఈ సమస్య పరిష్కారం అయితే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని చెప్పారు. నైనీ బ్లాక్‌లో తవ్వకాలు చేపట్టడం వల్ల ఒడిశా యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకు ఒడిశా సర్కార్‌కు ఆదాయం సమకూరుతుందని వివరించారు. దీంతో భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడి ఉన్నతాధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement