ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బోర్డు కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటిదాకా నిమిషం నిబంధన అమలు చేస్తున్న అధికారులు.. స్టూడెంట్స్ ఆత్మహత్యల నేపథ్యంలో పునరాలోచనలోపడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రానికి ముందస్తుగా రావడమో.. లేదా కనీసం అయిదు నిమిషాల వరకు అవకాశం కల్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఇవ్వాల సాయంత్రం లేఖ విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలిపింది. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతి చేస్తామన్నారు. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు.