ఢిల్లీలో ప్రధాని మోదీ సమక్షంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక నుంచి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన, ఇతర సంక్షేమ పథకాల కింద ఫోర్టిఫైడ్ బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది.
పోషకాహారంపై దృష్టి !
దేశవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన చర్యగా, ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయడానికి క్యాబినెట్ ఆమోదించింది. ఈ క్రమంలో గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని డిసెంబర్ 2028 వరకు పొడిగించారు.
అంటే అప్పటి వరకు పేదలకు ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తారు. దేశంలో రక్తహీనత, సూక్ష్మ పోషకాల లోపాలను నివారించడానికి ప్రధాన మంత్రి పోషణ్ అనే పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలులో ఉంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.17,082 కోట్లు కేటాయించనుంది.
నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ !
ఇక, గుజరాత్లోని లోథాల్లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎమ్హెచ్సీ) అభివృద్ధికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫేజ్ 1ఏకు రూ.1,238.05 కోట్లు… ఫేజ్ 1బీకి రూ.266.11 కోట్లు కేటాయించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 15,000, పరోక్షంగా 7,000 ఉద్యోగాలు వస్తాయని కేంద్ర కేబినెట్ అంచనా వేసింది. దాంతో పాటు స్థానిక కమ్యూనిటీలు, పర్యాటకులు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, పర్యావరణ సమూహాలు, వ్యాపారాలు ఈ ప్రాజెక్ట్ నుండి ప్రయోజనం పొందుతాయని భావిస్తున్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి !
రాజస్థాన్-పంజాబ్లో సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టబడుతుంది. ఈ మేరకు సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. రాజస్థాన్-పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో రూ.4,406 కోట్ల పెట్టుబడితో 2,280 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.