Thursday, September 12, 2024

AG Noorani | సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది కన్నుమూత

సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది ఏజీ నూరానీ గురువారం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. అత్యుత్తమ న్యాయ పండితులు, రాజకీయ వ్యాఖ్యాతల్లో ఒకరిగా నూరానీ గుర్తింపు పొందారు. కాశ్మీర్‌ ప్రశ్న, బద్రుద్దీన్‌ త్యాబ్జీ, మంత్రుల దుష్ప్రవర్తన, ఆసియా భద్రత కోసం బ్రెజ్నెవ్‌ యొక్క ప్రణాళిక, ది ప్రెసిడెన్షియల్‌ సిస్టమ్‌, ది ట్రయల్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌ వంటి అనేక పుస్తకాలను ఆయన రాశారు.

ఏజీ నూరానీ రాసిన కాలమ్‌ హిందుస్థాన్‌ -టైమ్స్‌, ది హిందూ, ది స్టేట్స్‌మన్‌ వంటి వివిధ పత్రికల్లో వచ్చాయి. 1930లో బొంబాయిలో జన్మించిన ఏజీ నూరానీ.. 1960 ప్రారంభంలో రాయడం ప్రారంభించి వందలాది వ్యాసాలను రూపొందించారు. న్యాయవాదిగా బాంబే హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు.

రాజకీయ ప్రత్యర్థి జయలలితకు వ్యతిరేకంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తరపున ఆయన హైకోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. ఏజీ నూరానీ మృతి పట్ల పలు రాజకీయ పార్టీలు సంతాపం తెలిపాయి. నూరానీ మరణం బాధాకరమని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఓమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement