Monday, September 16, 2024

Foreign Tour – పోలెండ్ కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోదీ

నేటి నుంచి రెండు రోజులు పోలెండ్ లోనే
అ త‌ర్వాత ఉక్రెయిన్ లో విజిట్
ఆ దేశ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ చ‌ర్చ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం పోలాండ్ బయలుదేరారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనతో ప్రధాని మరో రికార్డును సృష్టించారు. 45 ఏళ్ల తర్వాత పోలాండ్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. చివరిసారి 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ లో పర్యటించారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ భారత ప్రధానులు ఎవరూ కూడా ఆ దేశానికి వెళ్లలేదు. ఈ పర్యటనలో వివిధ కీలక అంశాలలో భాగస్వామ్యం, రక్షణ రంగంలో పరస్పర సహకారం తదితర అంశాలపై పోలాండ్ అధ్యక్షుడితో మోదీ చర్చించనున్నారని తెలిపింది.

- Advertisement -

ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో భారత విద్యార్థులకు పోలాండ్ సాయం చేసింది. ఉక్రెయిన్ నుంచి సుమారు 4 వేల మంది భారత విద్యార్థులు పోలాండ్ లోకి అడుగుపెట్టి, అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు 6 వేల మంది పోలిష్ మహిళలు, చిన్నారులకు భారత భూభాగంలో ఆశ్రయం కల్పించారు. కాగా, పోలాండ్ పర్యటన ముగించుకుని ఈ నెల 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆ దేశ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ తో చర్చలు జరపనున్నారు.

ఉక్రెయిన్‌లో శాంతి అకాంక్షిస్తున్నా…..

ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ”మధ్య ఐరోపాలో భారత్‌కు పోలండ్‌ కీలక ఆర్థిక భాగస్వామిగా ఉంది. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ దుడా, ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో నా భేటీ కోసం ఎదురుచూస్తున్నా. అక్కడి భారతీయులతోనూ ముచ్చటించనున్నా. ఆ పర్యటనను ముగించుకొని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదమిర్‌ జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు కీవ్‌ వెళ్లనున్నా. ఆ దేశంలో భారత ప్రధాని చేపట్టబోయే తొలి పర్యటన ఇదే కానుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధానాంశంగా ఈ పర్యటన సాగనుంది. గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌ వివాదానికి శాంతియుత పరిష్కారంపై జెలెన్‌స్కీతో నా ఆలోచనలు పంచుకొనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. అక్కడ శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నా” అని మోదీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement