న్యూ ఢిల్లీ – ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అమెరికా వెళ్లనున్నారు. నాల్గవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు మోదీ అక్కడికి వెళ్తున్నారు. ఈ నెల 21-23 తేదీలలో అమెరికాలో ఉంటారు ప్రధాని . న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కూడా మోదీ ప్రసంగిస్తారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. డెలావేర్లోని విల్మింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హోస్ట్ చేయనున్న క్వాడ్ సమావేశానికి మోదీ హాజరవుతారు. క్వాడ్ సమ్మిట్లో నాయకులు గత ఒక సంవత్సరంలో క్వాడ్ సాధించిన పురోగతిని సమీక్షిస్తారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు వారి అభివృద్ధి లక్ష్యాలు , ఆకాంక్షలను చేరుకోవడంలో సహాయం చేయడానికి రాబోయే సంవత్సరానికి ఎజెండాను నిర్దేశిస్తారు.
ఈ నెల 22న భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి కూడా ప్రసంగం చేయనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది
ఇక 23న న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో మోదీ ప్రసంగిస్తారు. దీనికి పలువురు ప్రపంచ నేతలు హాజరవుతారు.
సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కూడా ప్రధాని చర్చిస్తారు.
ఏఐ వంటి అత్యాధునిక రంగాలలో రెండు దేశాల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించడానికి ప్రముఖ US ఆధారిత కంపెనీల సి ఈ ఓ లతో కూడా మాట్లాడుతారు. భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయి.