Saturday, September 21, 2024

TG | మహిళలకు ఇక టీ-సేఫ్‌.. సైబర్‌ వేధింపులకు సాంకేతికతో చెక్‌

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మహిళల భద్రతకు షీ టీమ్‌, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌, భరోసా కేంద్రాలు నిరంతరం నిఘా సారించడంతో పాటు రక్షణ కల్పిస్త్తున్నాయి. తాజాగా విద్యార్థునుల, మహిళల రక్షణకు మరింత భరోసా కల్పించేందుకు రాష్ట్ర పోలీసులు టీ-సేఫ్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

మహిళలు క్యాబ్‌ల్లో ప్రయాణించేటప్పుడు సదరు మహిళలకు గమ్యస్థానాలకు చేరుకునేంతవరకు టీ-సేఫ్‌ యాప్‌ నిఘా సారిస్తుందని పోలీసు అధికారులు వివరిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లో.. ఉద్యోగ, ఉపాధి అవసరాల రీత్యా మహిళలు రాత్రీ పగలు అని తేడా లేకుండా ప్రయాణించే వారికి టీ సేఫ్‌ యాప్‌ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచిస్తున్నారు.

నగరంలోని సాఫ్ట్‌వేర్‌, ఇతర మహిళా ఉద్యోగులు ఓలా, ఊబల్‌, ర్యాపిడో లాంటి క్యాబ్‌ సర్వీసులను వినియోగించే సమయంలో రాష్ట్ర పోలీసులు అందుబాటుతోకి తెచ్చిన టీ-సేఫ్‌ యాప్‌ ఉపకారిగా ఉంటుందన్నారు. విద్యార్థునులు, మహిళలు క్యాబ్‌ల్లో ప్రయాణించేటప్పుడు పూర్తి పోలీసు నిఘా కల్పించడం ఈ యాప్‌ లక్ష్యమని ఉమెన్‌సేఫ్టీ వింగ్‌ అధికారులు వివరించారు.

టీ సేఫ్‌ యాప్‌ :

ఈ యాప్‌ ద్వారా మహిళలు, విద్యార్థినులకు ప్రయాణ సమయంలో ఆకతాయిలు నుంచి ఏమైనా ఇబ్బంది తలెత్తితే తక్షణం పోలీసు రక్షణ లభిస్తుందని తెలిపారు. దేశంలోనే మొదటి ట్రావెల్‌ మానిటరింగ్‌ సేవ అని, ఈ యాప్‌ ప్రయాణ సమయంలో ప్రతి స్టెప్‌ను కనిపెడుతూ మానిటర్‌ చేస్తుందన్నారు.

- Advertisement -

ఈక్రమంలో మహిళల రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ భరోసా ఇవ్వడంతో పాటు మహిళల భద్రత కోసం పనిచేసే షీ టీమ్‌లను రాష్ట్ర వాప్తంగా టీసేఫ్‌ యాప్‌ను విస్తరించేందుకు సమాయత్తమౌతున్నాయి.

సైబర్‌ వేధింపులపై సాంకేతిక నిఘా :

ఇటీవల కాలంలో మహిళలపై పెరుగుతున్న సైబర్‌ మోసాలపై షీ టీం బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిందితులకు శిక్షపడేలా చర్యలు చేపడుతున్నారు. ఉద్యోగం చేసే మహిళలను పైస్థాయి అధికారులు ఇబ్బంది పెట్టడం, విద్యార్థినుల అసభ్యంగా ప్రవర్తించడం వంటివాటిపై షీ టీమ్‌లు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

బాధితుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే బాలికలు, యువతులు, మహిళలను ఇబ్బందిపెట్టే ఆకతాయిలను అరెస్టు చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరాలు సైతం గణనీయంగా పెరిగాయని, సోషల్‌ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని అధికారులు వివరిస్తున్నారు.

ఫేక్‌ ఐడీలను క్రియేట్‌ చేసి మైనర్‌ బాలికలను టార్గెట్‌ చేస్తున్నారని, స్నేహం పేరిట పోస్టులు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలతోపాటు ఇతర వ్యక్తిగత భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పోస్టు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement