Saturday, June 29, 2024

T20WC | గెలిచిన వారిదే సెమీస్ బెర్త్.. భార‌త్ – ఆసీస్ మ‌ధ్య కీల‌క మ్యాచ్

టీ20 వరల్డ్ కప్‌లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సెయింట్ లూసియా వేదికగా సోమవారం భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ పోరులో విజయం సాధిస్తే టీమిండియా నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి లేదంటే ఇంటిముఖం పట్టాల్సిందే.

అయితే ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని టీమిండియా అభిమానులు భావిస్తున్నారు. సెమీస్‌లో కంగారూలు అడుగుపెట్టకుండానే టోర్నీ నుంచి ఔట్ చేయాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. గతేడాది భారత్ నుంచి ఆస్ట్రేలియా రెండు ఐసీసీ టోర్నీలను లాగేసుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్‌లో రోహిత్ సేనను ఓడించి విజేతగా నిలిచింది.

ఇక వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్లోనూ భారత్‌కు ఆస్ట్రేలియా కన్నీటినే మిగిల్చింది. 2023, నవంబర్ 19వ తేదీని శిఖర్ ధావన్‌తో సహా భారత క్రికెట్ అభిమానులకు ఇప్పటికే మరిచిపోలేకపోతున్నారు. టోర్నీ ఆద్యంతం వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా ఆఖరి మెట్టుపై బోల్తాపడి కప్‌ను చేజార్చకుంది. ఆ రోజున భారత ఆటగాళ్లు కన్నీటిని ఆపుకుంటూ మైదానాన్ని విడిచిన క్షణాలు అభిమానులు అంత సులువుగా మరవలేరు. అయితే వన్డే వరల్డ్ కప్ ప్రతీకారాన్ని తీర్చుకోవాలని అభిమానులతో పాటు టీమిండియా భావిస్తోంది.

దాని కోసం భారత్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు అదే తుదిజట్టును కొనసాగించిన టీమిండియా.. ఆస్ట్రేలియా ఊహలకు అందకుండా జట్టుకూర్పు సిద్ధం చేయాలని భావిస్తోంది. అంతే సెయింట్ లూసియా పిచ్‌కు తగ్గట్లుగా జట్టను ఎంపిక చేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. సెయింట్ లూసియా వికెట్ స్లోగా ఉంటుంది. కుల్‌దీప్ యాదవ్ రాకతో స్పిన్ విభాగం బలోపేతంగా మారింది.

కుల్‌దీప్‌కు తోడుగా అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నాడు. దీంతో రవీంద్ర జడేజా స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకురావాలని భారత్ భావిస్తోంది. పిచ్‌తో పాటు మైదానంలో వచ్చే గాలిని సిరాజ్ సమర్థవంతంగా ఉపయోగించుకోగలడు. కొత్త బంతితో విజృంభించగలడు. దీంతో సిరాజ్‌ను బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

వ‌రుణ గండం…

అయితే ఈ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉంది. సెయింట్‌ లూసియాలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వరుణుడు శాంతించినా మధ్యలో ఆటంకాలు తప్పవని సమాచారం.

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైతే భారత్‌కు ఎలాంటి నష్టం ఉండదు. 5 పాయింట్లతో టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఆసీస్‌ భవితవ్యం మాత్రం బంగ్లాదేశ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆసీస్‌ ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ భారత్‌తో మ్యాచ్‌ రద్దైతే ఆసీస్‌ ఖాతాలో 3 పాయింట్లు చేరతాయి.

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌ ఖాతాలో కూడా ప్రస్తుతం 2 పాయింట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు గెలిస్తే వారి ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. అప్పుడు ఆ జట్టే భారత్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది. ఆసీస్‌ ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది.

ఒకవేళ వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ కూడా రద్దైతే అప్పుడు మెరుగైన రన్‌ రేట్‌ ఉన్న కారణంగా ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడకుండా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. భారత్‌పై ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సి ఉంటుంది.

ఇలా జరిగితే మాత్రం భారత్‌ ఇంటికే..

ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నా సెమీస్‌ బెర్త్‌ ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ భారతపై ఆ్రస్టేలియా 41 పరుగుల తేడాతో గెలిచి అఫ్ఘనిస్తాన్‌ 81 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే రన్‌రేట్‌లో వెనుకబడి టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

భారత తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

సెమీస్ లో ఇంగ్గండ్, సౌతాఫ్రికా..

ఇదిలా ఉంటే, గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆ జట్టు నిన్న యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొంది దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆ గ్రూప్‌ నుంచి రెండో బెర్త్‌ కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్ల మ‌ధ్య జ‌రిగిన పోటీలో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement