Friday, October 4, 2024

Supreme Court | విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు

న్యూఢిల్లీ : ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టటం ఎంత మాత్రమూ సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విమర్శనాత్మక వార్తలు రాసిన సదరు జర్నలిస్టును అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను దేశ అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసింది. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం విచారించి.. ‘ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

జర్నలిస్టులు రాసిన కథనాలను ప్రభుత్వంపై విమర్శలుగా భావించి ఆయా జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని సూచించింది. అలా చేస్తే అది భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని పేర్కొన్నది. అదేవిధంగా జర్నలిస్ట్‌ అభిషేఖ్‌ ఉపాధ్యాయ్‌ను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement