Thursday, September 19, 2024

TG | ఇండోర్‌ తరహాలో హైదరాబాద్‌ మహానగరంలో పరిశుభ్రత..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : హైదరాబాద్‌ మహానగరాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ తరహాలో అద్భుతమైన క్లీన్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ శాఖ అధికారుల బృందం ఇండోర్‌ వెళ్లి అక్కడి నగర పరిశుభ్రతపై తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేయాలని కోరారు.

అక్కడ అనుసరిస్తున్న విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఏయే ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు ఇండోర్‌ పరిశుభ్రత పనుల్లో భాగస్వామ్యమవుతున్నాయో తెలుసుకొని చర్చలు జరపాలని, వీలైతే హైదరాబాద్‌ పరిశుభ్రతలోనూ ఆ సంస్థల సేవలను వినియోగించుకోవాలని సీఎం రేవంత్‌ అధికారులను కోరారు. హైదరాబాద్‌ను పరిశుభ్రత (క్లీన్‌ సిటీగా) నగరంగా తీర్చిదిద్దేందుకు ఇండోర్‌ కార్పొరేషన్‌ ఆదాయ వనరులెలా సమీకరిస్తుందనే వివరాలు కూడా తెలుసుకోవాలని కోరారు.

హైదరాబాద్‌ అభివృద్ధితో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, క్లీనింగ్‌, ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సచివాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే జయవీర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అమ్రాపాలీ, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో అయిదేండ్ల కిందట కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రాం కింద 811 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారని, వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేశారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌తో కాంట్రాక్టు గడువు ముగిసిపోతుందని, అందుకే రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. గడువులోగా అన్ని రోడ్ల పనులను పర్యవేక్షించి, వెంటనే బాగు చేయించాలని చెప్పారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి 15 రోజుల్లోగా తనకు పూర్తి నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు. తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రోడ్లతో పాటు చెత్త సేకరణపై జీహెచ్‌ఎంసీపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. అవసరమైతే జీఐఎస్‌, క్యూఆర్‌ స్కాన్‌ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం చెప్పారు. జీహెచ్‌ఎంసీలో నిరంతరం జరిగే పనులకు ఆర్థిక ఇబ్బంది లేకుండా నిధుల సమీకకరణకు కూడా స్పష్టమైన ప్రణాళికలు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ ఆస్తుల నుంచి వచ్చే అద్దెలు, అడ్వర్టయిజ్మెంట్లు, హూర్డింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయం వస్తుందా.. లేదా కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు.

- Advertisement -

మూసీ పనులను పరుగులు పెట్టించాలి..

మూసీ రివర్‌ డెవెలప్మెంట్‌ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతంలో సేకరించే స్థలాల్లో ఉన్న నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. ఎక్కడా తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు బాధపడకుండా, వారికి భరోసా కల్పించాలని చెప్పారు. పునరావాస కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా.. లేదా అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

చెర్లపల్లి రైల్వే స్టేషన్‌ ఆధునీకరిస్తున్నందున, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్‌కు చేరుకునే అప్రోచ్‌ రోడ్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అక్కడున్న పరిశ్రమలను మరో ప్రాంతానికి తరలించాలని చెప్పారు. స్టేషన్‌ ముందు పార్కింగ్‌, కమర్షియల్‌ జంక్షన్‌కు వీలుగా అప్రోచ్‌ రోడ్లు డిజైన్‌ చేసుకోవాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement