Tuesday, October 22, 2024

Delhi | 24న కేంద్ర హోంశాఖ కీలక భేటీ.. ఏపీ, తెలంగాణ‌ అపరిష్కృత అంశాలపై చ‌ర్చ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి మరో కీలక అడుగు పడింది. ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లయినప్పటికీ, ఇంకా అనేక అంశాలు ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ చొరవ తీసుకుని సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.

ఈ క్రమంలో ఈ నెల 24న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సమావేశానికి హాజరుకావాలని తెలంగాణ సీఎస్‌కు కేంద్ర హోంశాఖ సమాచారమిచ్చింది.

ఈ సమావేశంలో పలు కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు.. విద్యుత్‌, రహదారులు, ఉక్కు, వ్యవసాయం తదితర శాఖల కార్యదర్శులు కూడా పాల్గొంటారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలను కలిసి విభజన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ తాజాగా సమావేశం ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement