Monday, September 16, 2024

No Confidence Motion – మోడీ స‌ర్కార్ పై లోక్ స‌భ‌లో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అవిశ్వాస తీర్మానం

న్యూఢిల్లీ: మోడీ స‌ర్కార్‌పై అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు నేడు నోటీస్ లు ఇచ్చాయి . మ‌ణిపూర్ అంశంపై కేంద్ర విధానాలు స‌రిగా లేవ‌ని రెండు పార్టీలు ఆరోపించాయి. కాగా, లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు ఎంపీ నామా లేఖ రాశారు. రూల్ 198(బీ) ప్ర‌కారం లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్న‌ట్లు ఎంపీ నామా తెలిపారు. ఇవాళ జ‌రిగే లోక్‌స‌భ బిజినెస్‌లో ఈ నోటీసును కూడా చేర్చాల‌ని ఆయ‌న సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ను కోరారు. కాగా, విప‌క్షాల కూట‌మి INDIA త‌రుపున కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ‌ల్ కూడా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోష‌న్ ఫైల్ చేశారు.

మ‌ణిపూర్ అంశంపై చ‌ర్చ‌కు ప్ర‌ధాని మోదీ ముఖం చాటేయ‌డం వ‌ల్ల .. కేంద్ర ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. పార్ల‌మెంట్ వ‌ర్సాకాల స‌మావేశాలు ప్రారంభ‌మై నాలుగు రోజులు గ‌డిచినా స‌భ స‌జావుగా సాగ‌డం లేదు. కేంద్రం నిర్ల‌క్ష్య వైఖ‌రిని ఎండ‌గ‌ట్టేందుకు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వ‌డం స‌రైందే అని బీఆర్ఎస్ భావిస్తోంది.

కాగా, ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతుంది. ‘ఇండియా’కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. కేవలం మణిపుర్‌ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో 2018లో మోడీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement