Friday, September 13, 2024

Black Mail – హైడ్రా పేరుతో డబ్బు వసూళ్లు.. అరెస్ట్

హైద‌రాబాద్ – సోషల్‌ వర్కర్‌ ముసుగులో హైడ్రా పేరు చెప్పి రూ. 20 లక్షలు ఇవ్వాలని బిల్డర్లను డిమాండ్‌ చేసిన వ్యక్తిపై అమీన్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో సాయివిల్లాస్‌ రోడ్డులో ఎంసీఆర్‌ఓ ప్రాజెక్ట్‌ పేరుతో జూబ్లీహిల్స్ కు చెందిన బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్‌, మంజునాథ్‌రెడ్డి అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ, అపార్ట్‌మెంట్‌ పెద్దచెరువు నాలా బఫర్‌జోన్‌ పరిధిలోకి వస్తుందని, అదే కాలనీలో అద్దెకు ఉండే ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ బండ్ల విప్లవ్‌సిన్హా కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఫ్లాట్లు చూసేందుకు వచ్చే కస్టమర్లకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఆయన పలు ప్రభుత్వ శాఖలకు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పలుమార్లు అమీన్‌పూర్‌లో పర్యటించిన సందర్భంలో ఠంచన్‌గా ప్రత్యక్షమై ఆయనతో ఫొటోలు తీయించుకున్నాడు. గత నెలలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వచ్చిన మరుసటి రోజు బిల్డర్లు రాజేంద్రనాథ్‌రెడ్డి, మంజునాథ్‌రెడ్డిలను అశోక్‌నగర్‌ పిస్తాహౌజ్‌ వద్దకు పిలిపించి, తనకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చాలా దగ్గర అని ఫొటోలు చూపించి బెదిరించాడు.

- Advertisement -

అపార్ట్‌మెంట్‌ కూల్చకుండా ఉండాలంటే తనకు రూ.20 లక్షలు ముట్టచెప్పాలని లేదంటే, పత్రికల్లో వార్తలు రాయించి కూల్చివేయిస్తానన్నాడు. మరోమారు గచ్చిబౌలి ఆఫ్రికన్‌ కాఫీ హౌజ్‌ వద్దకు పిలిపించి తక్షణం ఎంతోకొంత డబ్బు ఇవ్వాలని, లేదంటే కూల్చడం ఖాయమని తీవ్రంగా బెదిరించాడు. హైడ్రా కమిషనర్‌తో పాటు గతంలో మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహతో దిగిన ఫొటోలను చూపించి బ్లాక్‌మెయిల్‌ చేయడంతో బిల్డర్లు కంగుతిన్నారు. ఇతడి వేధింపులు భరించలేక బాధితులు అమీన్‌పూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అత‌డిని అరెస్ట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement