Monday, June 24, 2024

TG | కేసీఆర్‌‌ను అరెస్ట్ చేయాల‌ని బీజేపీ తొంద‌ర ప‌డుతుంది : మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

గత ప్రభుత్వంపై నిందలు వేయ‌డానికి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బురదజల్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలతో విచారణ కమీషన్లు వేస్తొంద‌ని మాజీ మంత్రి ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి అన్నారు. నేడు (మంగళవారం) తెలంగాణ భవన్‌లో జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్‌తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు చెప్పించారని అన్నారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ తెలివి తక్కువతనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీకు తొందరగా ఉన్నట్లుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ వేరు కాదని… సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి పని చేస్తున్నారని ఐదేళ్లుగా చెబుతున్నామని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

కమిషన్‌కు ముందస్తు అభిప్రాయాలు ఉండొద్దు..

”ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. కేసీఆర్ తన లేఖలో అన్ని అంశాలను స్పష్టంగా వివరించారు, ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయి. కమిషన్‌కు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఉండరాదు. దురదృష్టవశాత్తూ కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయట పెట్టింది. వాస్తవానికి జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు అంగీకరించి ఉండాల్సింది కాదు. కేసీఆర్ విషయంలో ఏమీ తేల్చలేమని చెప్పి… రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చింది. ఛత్తీస్‌ఘడ్ ఒప్పందంతో రూ. 6000 కోట్ల నష్టం కాదు.. అంతకు మించి లాభం జరిగింది. లీకులను సమర్థించేలా కొందరితో ఈ రోజు మాట్లాడించారు. 17 వేల మిలియన్ యూనిట్లు తీసుకొని ఛత్తీస్‌ఘడ్‌కు రూ.7000 కోట్లు చెల్లిస్తే రూ.6000 కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుంది?. ఛత్తీస్‌ఘడ్‌కు సరిపడా విద్యుత్ ఇవ్వకపోవడంతో ఎక్కువ ధరకు కొన్నారు. నష్టం జరిగిందని ఇప్పుడు అంటున్నారు. మరి ఛత్తీస్‌గడ్ ఒప్పందం లేకపోతే 17 వేల మిలియన్ యూనిట్లకు 17 వేల కోట్లు కట్టాల్సి వచ్చేది” అని జగదీష్ రెడ్డి తెలిపారు.

సమైక్య రాష్ట్రంలో కలపడానికి కుట్ర

- Advertisement -

”ఉత్తర భారతం నుంచి కరెంట్ తీసుకోకుండా కేసీఆర్ ఫెయిల్ అయితే మళ్లీ సమైక్య రాష్ట్రంలో కలపాలన్నది వీరు కుట్ర. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే… తెలంగాణ లేకుండా చేయాలి. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, పదవుల్లో ప్రతి అక్షరంలో కేసీఆర్ పేరు ఉంది. కేసీఆర్‌కు మసి పూయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎందుకు మీడియా సమావేశం పెట్టి చెప్పలేదు?. దొంగలుగా చీకట్లో ముసుగులు వేసుకొని ఎందుకు వ్యవహరిస్తున్నారు. రూ. 6000 కోట్ల నష్టం అన్న కథనాల్లో ప్రతి అక్షరం అబద్దమే. అవినీతి జరిగితే రమణ్‌సింగ్, కాంగ్రెస్ సీఎంలకు ఇచ్చారా? నల్గొండ జిల్లాలో విద్యుత్ కేంద్రం ఎందుకు పెట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే ఖబర్దార్. నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా ? కోదండరాంకి నల్గొండ కనిపించడం లేదా? నల్గొండ జిల్లా దద్దమ్మ నేతలు నాటి లాగే ఇప్పుడు కూడా నోరెత్తకుండా వ్యవహరిస్తున్నారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు” అని జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

కోదండరాం డొంక తిరుగుడుగా మాట్లాడొద్దు

”నాడు ఛత్తీస్‌గడ్ నుంచి రూ.3.90కి యూనిట్ విద్యుత్ కొనకముందు జజ్జర్ నుంచి రూ. 17 రూపాయలకు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేసే వాళ్లం. టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం సూటిగా సమాధానం చెప్పాలి, డొంక తిరుగుడుగా మాట్లాడొద్దు. దొంగలతో చేతులు కలిపి ఉన్న ఈర్ష్యను చాటుకుంటున్నారు. హైదరాబాద్‌లో గతంలో విద్యుత్ కోతలతో లక్షల జనరేటర్లతో వచ్చిన శబ్ద, వాయు కాలుష్యం ఎంత? ఎంత మంది క్యాన్సర్ బారిన పడి ఉంటారు. మణుగూరు విద్యుత్‌తో హైదరాబాద్‌లో కోతలు పోయి జనరేటర్లు బంద్ కావడం వల్ల ఎంత మేలు జరిగిందో ప్రజలు ఆలోచించుకోవాలి. తమకు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఆదాయం వచ్చిందని ఛత్తీస్‌ఘడ్ ఆంటుంటే కేసీఆర్ తెలంగాణకు ఎలా అన్యాయం చేశారు..? గతంలో యాదాద్రి విద్యుత్ కేంద్రం బంద్ చేయిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రోషం ఉంటే ప్రారంభోత్సవానికి పోకూడదు. కోదండరాం చిన్న పదవి కోసం ఆశ పడి దొంగలకు మద్దతు పలుకుతున్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం కోదండరాం పాకులాడుతున్నారు” అని జగదీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement