Friday, September 20, 2024

Assembly – విద్యుత్​ కొనుగోళ్లలో వేల కోట్ల అవినీతి – ఎవరినీ వదిలేది లేదన్న రేవంత్

జ్యుడీషియల్​ ఎంక్వైరీ వేశామన్న సీఎం రేవంత్​
కమిషన్​ను రద్దు కాలేద‌ని వెల్ల‌డి
చైర్మన్​ని మార్చాలని సుప్రీంకోర్టు సూచించింది
కేసీఆర్ హ‌యాంలో ఒక్క యూనిట్ కూడా సోలార్ ఉత్ప‌త్తి కాలేదు
విద్యుత్ కొనుగోళ్ల‌లో వేల కోట్ల అవినీతి జ‌రిగింది
విద్యుత్​ కమిషన్​ విచారణపై బీఆర్​ఎస్​కు ఎందుకు ఉలికిపాటు
సాయంత్రంలోగా కొత్త చైర్మన్ వస్తారన్న సీఎం

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: విద్యుత్ కొనుగోళ్లపై జ్యూడిషియల్ కమిషన్ విచారణ జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. సాయంత్రంలోగా కొత్త చైర్మ‌న్ వ‌స్తార‌ని తెలిపారు. విద్యుత్ విచారణ కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ కోర్టుకెళ్లారని, సుప్రీం కోర్టు విద్యుత్ కమిషన్ ను రద్దు చేయలేదని, విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చి విచారణ చేయాలని సూచించిందన్నారు. కమిషన్ వివరాలు అడిగితే కేసీఆర్ ఇవ్వలేదని మండిప‌డ్డారు. విభజన జరిగేటప్పుడు తెలంగాణకు 54 శాతం విద్యుత్ కేటాయింపులు చేశారని చెప్పారు. విద్యుత్ కేటాయింపుల కోసం జైపాల్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రారంభించిన విద్యుత్ ప్లాంట్లను కేసీఆర్ పూర్తి చేశారన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క యూనిట్ కూడా సోలార్ పవర్ ఉత్పత్తి చేయలదేని చెప్పారు. విద్యుత్ విచారణపై బీఆర్ఎస్ నేతలకు భయమెందుకని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

- Advertisement -

బినామీల‌కే క‌ట్ట‌బెట్టి దోచుకున్నారు

అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నేత‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుని రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు. పవర్ ప్లాంట్ లు బీహెచ్ఈఎల్ కు ఇస్తున్నామని చెప్పి వాళ్ల నుంచి సివిల్ కాంట్రాక్టులు వీళ్ల బినామీలకు ఇప్పించి కమిషన్లు తీసుకున్నారని మండిప‌డ్డారు. సబ్ క్రిటికల్ నుంచి సూపర్ క్రిటికల్ కు అప్ గ్రేడ్ చేయాలని కేంద్రం సూచిస్తే క‌మీష‌న్ల‌కు కక్కుర్తి పడి సబ్ క్రిటికల్ యంత్రాగాన్ని కొనుగోలు చేసి వాటికి టెండర్లు పిలిచి వాటితో పవర్ ప్లాంట్ కట్టించారన్నారు.

భద్రాద్రి ప్లాంట్​లో తరచూ సమస్యలే..

దీంతో.. ఎప్పుడూ భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఏదో ఓ సాంకేతిక సమస్య తలెత్తుతూ వస్తుందని సీఎం రేవంత్​ చెప్పారు. రెండున్నర ఏళ్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును తొమ్మిదున్నర ఏళ్ల గ‌డుస్తున్నా పూర్తి చేయలేదని విమర్శించారు. గుజరాత్ కు చెందిన కంపెనీ నుంచి రూ. 1000 కోట్లు కమిషన్లు తీసుకుని పవర్ ప్రాజెక్టులు కట్టారని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా ఇలాగే చేశారని సీఎం మండిప‌డ్డారు. నిజాలు చెబితే బుకాయించే పనులు చేస్తున్నారని సోనియా దయతో జైపాల్ రెడ్డి కృషితో ఇప్పుడు తెలంగాణ వెలుగులు చిమ్ముతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement