Friday, October 18, 2024

AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తుపాను ముప్పు

బంగాళాఖాతంలో ఆవ‌ర్త‌నం
వాయుగుండంగా మారే చాన్స్‌
17 నాటికి తీరం దాటే అవ‌కాశం
ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ‌: ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ నమూనాలు (మోడల్స్‌) అంచనా వేస్తున్నాయి.

17న తీరం దాటే అవ‌కాశం..

- Advertisement -

ఇక‌.. తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈ నెల 17 నాటికి రాష్ట్రంలోని తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. ఇది తుపానుగా బలపడి రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు రాష్ట్రం మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తోంది. అల్పపీడనం ఏర్పడ్డాక దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు అంటున్నారు.

ప‌లు జిల్లాలో భారీ వర్షాలు..

తుపాను ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచ‌నా వేస్తోంది. ఇక‌.. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. కర్నాటక, గోవా రాష్ట్రాల తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ 2 లేదా 3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement