Sunday, June 30, 2024

Andhra Pradesh పోల‌వ‌రంలో అంత‌ర్జాతీయ నిపుణులు…నాలుగు రోజుల పాటు అధ్య‌య‌నం

అమరావతి: పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం దిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి వారు నేటి ఉదయం  పోలవరం ప్రాజెక్టు కు వచ్చారు. అంతర్జాతీయ జలవనరుల రంగం నిపుణులు నేటి నుంచి నాలుగు రోజుల పాటు పరిశీలించనున్నారు. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు ఇందులో ఉన్నారు.

రెండ్రోజుల పాటు ప్రాజెక్టు ఆసాంతం పరిశీలిస్తారు. ప్రతి కట్టడాన్ని ఆమూలాగ్రం పరిశీలించేలా పర్యటన షెడ్యూల్‌ సిద్ధమైంది. ఆ తర్వాత రెండ్రోజుల పాటు మేధోమథనం చేయనున్నారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ సంస్థ ప్రతినిధులు, వ్యాప్కోస్, బావర్, కెల్లర్, మేఘా కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్‌ సంస్థ అఫ్రి ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు, వివిధ ప్రొఫెసర్లు, నిపుణులతో అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు.

పోలవరంలో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు, పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యమే శరణ్యమని కేంద్ర జలసంఘం నిర్ణయించిన క్రమంలో ఈ అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే డిజైన్లు రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్‌ ఏజెన్సీ అఫ్రి సాయం తీసుకుంటున్నారు. వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్‌ బి పాల్, గియాస్‌ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్‌ డోన్నెల్లీ, సీస్‌ హించ్‌బెర్గర్‌లు నియమితులయ్యారు. పోలవరంలో సవాళ్లకు సంబంధించిన కీలక అంశాల్లో వీరు నిపుణులు. అంతర్జాతీయ డ్యాం భద్రత నైపుణ్యం, సివిల్‌ ఇంజినీరింగ్, హైడ్రాలిక్‌ నిర్మాణాలు, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్‌ సొల్యూషన్స్, జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండటంతో వీరిని ఎంచుకున్నట్లు కేంద్ర జలసంఘం పేర్కొంటోంది.

ఎగువ కాఫర్‌ డ్యాంతో ప్రారంభం

- Advertisement -

ఈ నిపుణులు అక్క‌డ‌కు చేరుకున్నారు.. ముందుగా కొద్దిసేపు అధికారులతో మాట్లాడతారు. తర్వాత ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారు. ఎగువ కాఫర్‌ డ్యాం సందర్శనతో వీరి పర్యటన ప్రారంభమవుతుంది. ఆయా కట్టడాలు, నిర్మాణాలు పరిశీలించే క్రమంలో వాటికి సంబంధించిన డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్, నిర్మాణ క్రమం సందర్భంగా తీసిన ఫోటోలు, అధ్యయనాల నివేదికలు వారికి అందించేందుకు పోలవరం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ క్రమంపై ఫోటోలతో నివేదికను సమర్పించనున్నారు. 2018లో ఈ డ్యాం భద్రతకు సంబంధించి విశ్లేషణల నివేదిక, ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీపై ప్రొఫెసర్‌ రాజు 2021లో ఇచ్చిన నివేదికలు, 2022, 2023 సంవత్సరాల్లో ఫీజోమీటర్ల సాయంతో సీపేజీపై జరిపిన విశ్లేషణలు, 2024 జనవరిలో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ (కేంద్ర మట్టి పరిశోధన కేంద్రం) సమర్పించిన నివేదిక, కొత్తగా వచ్చిన అఫ్రి సంస్థ జియో టెక్నికల్‌ పరిశోధనలకు సంబంధించిన వివరాలు అంతర్జాతీయ నిపుణులకు అందిస్తారు. తర్వాత దిగువ కాఫర్‌ డ్యాంను దాదాపు గంటన్నర సేపు పరిశీలించేలా షెడ్యూల్‌ రూపకల్పన చేశారు. ఈ సీపేజీ నివేదికలూ వారికి అందిస్తారు.

ఒక రోజంతా ప్రధాన డ్యాం పైనే..

ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలు, డయాఫ్రం వాల్‌ విధ్వంసం పరిశీలన, అగాధాలు, అక్కడ భూభౌతిక పరిస్థితుల మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై నిపుణులు ఎక్కువ ఫోకస్‌ చేయనున్నారు. తొలి రోజు రెండు గంటల పాటు అక్కడే ఉండటంతో పాటు రెండో రోజు సమయం మొత్తం ఇందుకే కేటాయిస్తారు. ప్రస్తుతం పోలవరంలో ప్రధాన సవాళ్లన్నీ ఇక్కడే ఉన్నాయి. రెండు గంటల పాటు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన మొదటి గ్యాప్‌ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఇప్పటికే అక్కడ కొంత మేర పని జరిగింది. ఎడమ వైపున అక్కడ నిర్మించిన డయాఫ్రం వాల్‌నూ పరిశీలిస్తారు. జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదికలను సమర్పిస్తారు. 2020 దిల్లీ ఐఐటీ ఇచ్చిన నివేదికను, అగాధాలు ఏర్పడ్డ ప్రాంతాల్లో వైబ్రో కాంపాక్షన్‌ పనులు, వాటిపై అధ్యయన పత్రాలు, డయాఫ్రం వాల్‌పై ఎన్‌హెచ్‌పీసీ నివేదికలు అందిస్తారు. తర్వాత రెండ్రోజుల్లో నిపుణులు, అధికారులతో వారు చర్చిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement