Sunday, September 15, 2024

ముగిసిన అమృత్ సమాగం సదస్సు.. హాజరైన తెలంగాణా సాంస్కృతిక శాఖ డైరెక్టర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర మంత్రులతో ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన అమృత సమాగం సదస్సు ముగిసింది. అశోకా హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రి మీనాక్షి లేఖి, వివిధ రాష్ట్రాల పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టిన కార్యక్రమాలపై అమృత్ సమాగం సదస్సు నిర్వహించారు. బుధవారం తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణలో చేపట్టిన కార్యక్రమాలను ఆయన సదస్సులో వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, హైదరాబాద్ రాష్ట్ర విలీనం అంశాలను మామిడి హరికృష్ణ ప్రస్తావించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఏడాది కాలం పాటు తెలంగాణ ప్రత్యేక దేశంగా ఉందని, ఆపరేషన్ పోలో – పోలీస్ యాక్షన్‌తో హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైందని ఆయన చెప్పుకొచ్చారు. అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణలో కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రానున్న రోజుల్లో లఘు చిత్రాలు, యోగా దినోత్సవ కార్యక్రమాలు చేపడతామని మామిడి హరికృష్ణ వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement