Thursday, September 26, 2024

America – హూవర్ డ్యామ్ ను సంద‌ర్శించిన ఉప ముఖ్య‌మంత్రి భట్టి…

హైద‌రాబాద్ – అమెరికాలోని నేవడ, అరిజోన రాష్ట్రాల సరిహద్దులో కొలరాడో నదిపై ఎనిమిది దశాబ్దాల క్రితం నిర్మించిన అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు హూవర్ డ్యామ్ ఎంతో ఆదర్శవంతమైందని, ఇక్కడి నీటి వినియోగం, అమలవుతున్న రక్షణ చర్యలు ఆచరించదగినవని తెలంగాణ రాష్ర్ర్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన బుధవారం నాడు రాష్ట్ర ప్రతినిథి బృందంలో ఉన్న ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండీ
ఎన్.బలరామ్, స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ ఇంకా ఇతర అధికారులతో కలిసి హూవర్ డ్యామ్ ను సందర్శించారు. ఫెడరల్ గవర్నమెంట్ అధికారులు వారికి ప్రాజెక్టు వివరాలను స్వయంగా వివరించారు.

తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడిన కాలంలో 1931-36 మధ్య నిర్మించిన ఈ ఆర్క్ గ్రావిటీ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతమని, ఇక్కడ గల 17 జనరేటర్ల ద్వారా 2080 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని, తద్వారా మూడు రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీరుస్తుందని అధికారులు వివరించారు. ఈ ప్రాంతంలోని మూడు ప్రధాన పట్టణాల్లో ఉన్న 80 లక్షల మంది ప్రజల మంచినీటి అవసరాలతో పాటు సాగునీటి అవసరాలు కూడా హూవర్ డ్యామ్ తీరుస్తుందని వారు వివరించారు. 726 అడుగుల ఎత్తు, 1244 అడుగుల పొడవు ఉన్న ఈ డ్యామ్ వెనుక ఒక పెద్ద కృత్రిమ సరస్సు ఏర్పడిందని, పూర్తి నీటి నిలువ సామర్థ్యం ఉన్నప్పుడు 185 కిలోమీటర్ల పొడవున నీటితో విస్తరించి ఉంటుందని వివరించారు. ఏటా సుమారు 80 లక్షల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అక్కడ జరుగుతున్న జల విద్యుత్తు ఉత్పాదకత, యంత్రాల సామర్థ్యం, నీటి లభ్యత, అడుగడుగునా ఏర్పాటు చేసిన రక్షణ చర్యలు, ఇంకా ఇతర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో గల జల విద్యుత్తు ప్రాజెక్టుల సమాచారంతో బేరీజు వేస్తూ హువర్ డ్యామ్ జలవిద్యుత్తు ఉత్పాదకతను స్ఫూర్తిగా తీసుకొని మన ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుదలకు, రక్షణ మెరుగుదలకు గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర అధికారులను కోరారు. ఈ సందర్భంగా 1931 నుండి 35 మధ్య జరిగిన డ్యామ్ నిర్మాణ దృశ్యాలను, ఫోటోలను డ్యామ్ అధికారులు ప్రదర్శించారు.

వర్చువల్ రియాలిటీ సాయంతో బొగ్గు ఉత్పత్తి ఒక అద్భుతం
మైనెక్స్-2024 అంతర్జాతీయ ప్రదర్శనలో భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర ప్రతినిథి బృందంతో కలిసి వివిధ ప్రఖ్యాత కంపెనీల స్టాల్స్ ను సందర్శించారు. శాండ్విక్ కంపెనీ స్టాల్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని పరిశీలించారు. అనంతరం అదే స్టాల్లో ఏర్పాటు చేసిన వర్చువల్ రియాలిటీ మైనింగ్ టెక్నాలజీని స్వయంగా పరిశీలించారు.

ఈ వర్చువల్ రియాలిటీ ద్వారా గని లోపల పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నందు వల్ల యంత్రాలను నడిపే ఆపరేటర్లు దీనితో మెరుగైన శిక్షణ పొందేందుకు అవకాశం ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఈ వర్చువల్ రియాలిటీతో గని యొక్క పని ప్రదేశానికి యంత్రాన్ని పంపించి అక్కడి పరిస్థితులను వెలుపలు నుండే అంచనా వేస్తూ బొగ్గును త్రవ్వొచ్చని, ఇది అత్యాధునిక మైనింగ్ పద్ధతిగా నిలుస్తుందని నిర్వాహకులు చెప్పారు. భట్టి స్వయంగా వర్చువల్ రియాలిటీ సాంకేతికతను హెడ్ గేర్ ధరించి పరిశీలించారు.

ఈ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు అద్బుతం అని, ఈ ఆధునిక సాంకేతికత వల్ల కార్మికులకు చిన్న ప్రమాదం జరగకుండా ఉత్పత్తిలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ తరహా సాంకేతికతను ప్రస్తుత గనుల్లో, భవిష్యత్తు గనుల్లో ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని బృందంలో ఉన్న సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్ ను కోరారు. ఈ ప్రదర్శనలో ఇంకా రోనాల్డ్ రోస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement