Friday, September 13, 2024

All Party Meeting – బంగ్లాదేశ్ ప‌రిణామాల‌పై కేంద్ర అఖిల‌ప‌క్షం … విదేశీ కుట్ర ఉందా అంటూ ప్రశ్నలు …

మోదీకి సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపిన విపక్షాలు
బంగ్లాదేశ్ ప‌రిణామాల‌పై కేంద్ర అఖిల‌ప‌క్ష సమావేశం
అన్ని పార్టీల ప్ర‌ధాన నేత‌లు హాజ‌రు
బంగ్లా పరిస్థితుల‌ను వివ‌రించిన విదేశాంగ శాఖ మంత్రి
విదేశీ కుట్ర ఉందా అని ప్ర‌శ్నించిన రాహుల్ గాంధీ
ఇప్పుడే చెప్ప‌లేమ‌న్న కేంద్రం
సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌న్న జై శంక‌ర్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూఢిల్లీ – పొరుగుదేశం బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న భారీ అల్లర్లు, ప్రధాని హసీనా రాజీనామా, భారత్ కు శరణార్ధిగా రావడంపై ఇవాళ కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. . దీనికి విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలు పార్టీల నేతలు హాజరయ్యారు. కేంద్ర హోం, విదేశాంగ, రక్షమ మంత్రులు అమిత్ షా, జై శంకర్, రాజ్ నాథ్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు.

అఖిలపక్ష భేటీలో విదేశాంగమంత్రి జై శంకర్ బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాల క్రమాన్ని విపక్షాలకు వివరించారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అక్కడి పరిణామాల గురించి విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ .పార్టీల నేతలకు వివరించారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవని వెల్లడించారు. ”భారతీయలను తరలించేంతగా బంగ్లాదేశ్‌లోని పరిస్థితులు ప్రమాదకరంగా లేవు. కానీ అక్కడి పరిస్థితుల్ని అత్యంత అప్రమత్తతతో గమనిస్తున్నాం. బంగ్లాదేశ్‌లో 12-13 వేల మంది భారతీయులున్నారు. పొరుగుదేశంలో ఉన్న మన ప్రజల భద్రత విషయమై అక్కడి ఆర్మీతో టచ్‌లో ఉన్నాం” అని మంత్రి వెల్లడించారు. అలాగే ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనాతో భారత ప్రభుత్వం మాట్లాడిందన్నారు. మానవత్వ చర్యలో భాగంగానే ఆమెకు భారత్‌లో ఆశ్రయం ఇచ్చామని చెప్పారు. భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు కొంత సమయం కావాలని భావిస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా జైశంకర్‌కు ఇండియా కూటమి విపక్ష నేత రాహుల్‌ గాంధీ మూడు కీలక ప్రశ్నల్ని సంధించారు. ఢాకాలో ప్రభుత్వ మార్పిడితో దౌత్యపరమైన పరిణామాలను ఎదుర్కోవడంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహం ఏమైనా ఉందా..? అని కేంద్ర సర్కార్ ను ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక, షేక్ హసీనాను గద్దె దింపేందుకు గత కొన్ని వారాలుగా బంగ్లాలో జరిగిన నాటకీయ పరిణామాల వెనుక విదేశీ శక్తుల కుట్ర.. ప్రత్యేకించి పాకిస్థాన్‌ ప్రమేయం ఏమైనా ఉందా..? అని రాహుల్‌ ప్రశ్నించాగా.. దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందర పాటు అవుతుందని జై శంకర్ బదులిచ్చారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, పాకిస్థాన్ దౌత్యవేత్త ఒకరు ఆందోళనలకు సపోర్టుగా తన ప్రొఫైల్‌ పిక్‌ను నిరంతరం మారుస్తున్నారని పేర్కొన్నారు.

అలాగే, బంగ్లాదేశ్‌లో నాటకీయ పరిణామాలను భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఊహించిందా అని కూడా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ కేంద్రమంత్రిని ప్రశ్నించారు. దీనికి విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ.. పరిస్థితిని భారత్‌ పర్యవేక్షిస్తోంది అన్నారు. ఇక, ఈ ఆల్‌ పార్టీ మీటింగ్‌లో పొరుగు దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement