Monday, September 30, 2024

Air Trains – హైడ్రోజ‌న్ రైళ్లు వ‌చ్చేస్తున్నాయి…

ఢిల్లీ విమానాశ్ర‌యంలో రైల్వే లైన్
ఇప్పటికే డిపిఆర్ రెడీ
ఎయిర్ పోర్టు ప్ర‌యాణీకుల కోసం రైళ్లు
టెండ‌ర్లు పిలిచేందుకు రంగం సిద్ధం
2027 లో అందుబాటులోకి ట్రైన్స్

న్యూఢిల్లీ – దేశంలో ఇప్పటివరకు సాధారణ రైళ్లు నడుస్తుండటం చూస్తున్నాం. క్రమేణా రాజధాని, శతాబ్ది, వందేభారత్, వందే మెట్రో, వందే సాధారణ్ పేరుతో అనేక రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. త్వరలోనే హైడ్రోజన్ రైళ్లను తీసుకురాబోతోంది. వచ్చే ఏడాది చివరకు తొలి బుల్లెట్ రైలు పట్టాలెక్కబోతుండటంతోపాటు సొంత పరిజ్ఞానంతో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఇంజన్లను భారత్ తయారు చేయబోతోంది. ఇన్ని ప్రత్యేకతలున్న సమయంలోనే మరో సరికొత్త రైలును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. దీన్ని ఎయిర్ ట్రైన్ అంటారు.

న్యూఢిల్లీ విమానాశ్ర‌యంలో ..

- Advertisement -

ఆటోమేటెడ్ పీపుల్ మూవర్-ఏపీఎం సర్వీసుగా వ్యవహరించే ఈ ఎయిర్ ట్రైన్ న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కాబోతోంది. విమానాశ్రయంలో ఉన్న మూడు టెర్మినల్స్ కు వెళ్లేందుకు లేదంటే విమానాన్ని డీబోర్డింగ్ చేసిన తర్వాత క్యాబ్ కోసం బస్సు సర్వీస్ ఉంది. అయితే ఇక్కడ సమయం చాలా ఎక్కువగా పడుతోంది. ఎందుకంటే ఇది చాలా రద్దీగా ఉండే విమానాశ్రయం. ఏడుకోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రానున్న ఎనిమిది సంవత్సరాల్లో ఈ సంఖ్య 13 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

ఆలస్యాన్ని నివారించేందుకు

ఒక టెర్మినల్ నుంచి మరో టెర్మినల్ కు వెళ్లే ఆలస్యాన్ని నివారించేందుకు ఎయిర్ ట్రైన్ తీసుకురాబోతున్నారు. ఇది మెట్రో తరహాలో డ్రైవర్ లేకుండా ఉంటుంది. రెండువేల కోట్ల రూపాలయ వ్యయంతో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. 2027 నాటికి అందుబాటులోకి రాబోతోంది. తక్కువ సంఖ్యలో బోగీలుండి ట్రాక్ పై నడుస్తుంది. విమానాశ్రయంలోని హోటళ్లు, క్యాబ్ ఎక్కే పాయింట్లు, పార్కింగ్, ఇతర టెర్మినల్స్ వెళ్లడానికి దీనివల్ల సులువవుతుంది. వేగంగా తీసుకువెళుతుంది. నాలుగు స్టాపులతో 7.7 కిలోమీటర్ల దూరాన్ని ఇది కవర్ చేస్తుంది. ఈ ఏడాది చివరలో టెండర్లు పిలవబోతున్నారు. ఎయిర్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సు సర్వీసులను తొలగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement