Monday, September 16, 2024

U.P | హత్రాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… 12 మంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును లోడర్ వాహనం ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. ముందు వెళ్తున్న బస్సును లోడర్ వాహనం ఓవర్‌టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆగ్రా-అలీఘర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా డీఎం, ఎస్పీ ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుల్లో చిన్న పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రమాద తీవ్రతను పరిశీలించిన వారు… మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం..

రోడ్డు ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్ట పరిహారం

ఉత్తరప్రదేశ్ రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి కార్యాలయం కూడా స్పందించింది. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి పీఎంఎన్ఆర్ఎఫ్ కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల సాయం అందించనున్నట్టు పీఎంవో ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement