హైదరాబాద్ – శేరిలింగంపల్లి, కూకట్పల్లి మండలాల సరిహద్దులోని గుట్టల బేగంపేట, (guttala begumpet ) అల్లాపూర్ (Allapur) గ్రామాల మధ్య ఉన్న సున్నం చెరువు (sunnam cheruvu ) ఎప్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) (FTL) పరిధిలోనే సియెట్(ఎస్ఐఇటి) లే ఔట్ వస్తోందని హైడ్రా స్పష్టం చేసింది. ఆ లే ఔట్కు (Lay Out ) సంబంధించి గతంలో హెచ్ ఎండీఏ ఇచ్చిన డ్రాఫ్ట్ లే ఔట్ను కూడా ఇదే కారణంగా రద్దుచేసిన విషయాన్ని హైడ్రా గుర్తు చేసింది. అలాగే ఇక్కడే గతంలో ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చిన జీహెచ్ ఎంసీ కూడా ఆ అనుమతులను రద్దు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలంటూ సియట్ లే ఔట్ ప్లాట్ల యజమానులు ఆందోళన చేయడంలో అర్థం లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సున్నం చెరువు 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1975లో సర్వే ఆఫ్ ఇండియా లెక్కలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. అలాగే గ్రామ రికార్డుల్లో కూడా ఇదే విషయం స్పష్టమౌతోంది. అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలమేరకు ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ ఎంసీ విభాగాలతో కలిసి హైడ్రా సర్వే కూడా చేయించింది. అన్ని కోణాల్లో పరిశీలించాక.. సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల్లో ఉన్న లెక్కలే తేలాయి. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో, నాలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను ఉపేక్షించవద్దని.. వెంటనే వాటిని తొలగించాలని కోర్టులు ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్న విషయాన్ని హైడ్రా ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. ప్రస్తుతతం ఆ లే ఔట్లో ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. ఖాళీగా ఉన్న ప్లాట్లకు సంబంధించి అర్హులమని భావిస్తే నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని హైడ్రా సూచించింది. చెరువు పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగించవద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది. ఈ విషయాలను మీడియా దృష్టిలో పెట్టుకోవాలని కోరింది.