ఆదోని – ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi ) ముస్లింల ద్రోహి అని ఆయన పాలనలో ముస్లింల (Muslims ) పట్ల అన్యాయం ఎక్కువైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసీ… ఒకప్పుడు చంద్రబాబు (Chandrababu ) ఎన్టీఆర్కు (NTR ) వెన్నుపోటు పొడిచారని, ఇప్పడు వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు ఇచ్చి లోకేష్ (Lokesh )_ ఎదుగుదలకు అడ్డపడ్డారని అని అన్నారు.
ఎపిలోని కర్నూలు జిల్లా ఆదోని జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ , చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు అంటూ ఆరోపణలు గుప్పించారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై మాట్లాడుతూ, పవన్ హీరో అయితే నేను అతని కంటే పెద్ద హీరో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అమరావతి (Amaravathi ) అభివృద్ధికి తాము కూడా మద్దతుగా ఉంటామని స్పష్టం చేసిన ఒవైసీ, అమరావతి అభివృద్ధి కోసం తామూ పోరాడతాం అన్నారు. అయితే లోకేష్ రాజకీయ ఎదుగుదలకి చంద్రబాబే అడ్డుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వడం అంటే లోకేష్ రాజకీయ జీవితాన్ని సమాధి చేయడమేనన్నారు..
ఇప్పటికైనా చంద్రబాబు తలుచుకుంటే వక్ఫ్ బిల్లు అమలుకాకుండా చూడగలరని అన్నారు.. ఇప్పటికైనా చంద్రబాబు వక్ఫ్ బోర్డు బిల్లుకు తన మద్దతు ఉపసంహరించుకోవాలని కోరారు.
అయితే, వైఎస్సార్సీపీ పై సానుకూలంగా స్పందించిన ఆయన, తమకు పార్లమెంట్లో జగన్ మోహన్ రెడ్డి ఎంపీలు మద్దతు ఇచ్చారన్నారు. టీటీడీలో అన్యమతస్తుడిని తీసుకోకూడదని చట్టం తేవడం ఏ మేరకు సమంజసమో అని ప్రశ్నించిన ఒవైసీ, అదే తరహాలో వక్ఫ్ బోర్డులో మాత్రం అన్యమతస్తుడిని ఎలా అనుమతించాలంటారని మండిపడ్డారు.
అలాగే ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని, రాజకీయాల్లో పెద్ద పెద్ద నేతలు కూడా వెళ్లిపోతున్నారని అన్నారు.