ఇస్లామాబాద్ – పహల్గాం దాడి వెనుకున్న పాక్కు ఝలకిచ్చేందుకు భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం దయాది దేశానికి గట్టి షాకే ఇచ్చింది. రాబోయే ముప్పును తలుచుకుని పాక్ రాజకీయ నేతలు మొదలు సామాన్యుల వరకూ వణికిపోతున్నారు. చిక్కులు తప్పవని చింతిస్తున్నారు. భారత్ చర్యలు పాక్కు భారీ షాకిచ్చాయనేందుకు సూచనగా అక్కడి పీపీపీ పార్టీ నేత బిలావాల్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
సింధూ నదీలో నీరు ప్రవహించకపోతే పాక్ ప్రత్యర్థుల రక్తం పారుతుందంటూ బిలావాల్ నోరు పారేసుకున్నారు. సింధూ నాగరికత పరిరక్షకులం తామే అంటూ భారత్కు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘సింధూ నది మాదే. ఎప్పటికీ మాదే. నదిలో నీరైనా పారుతుంది లేదా వారి రక్తమైనా పారుతుంది. పాకిస్థాన్ గానీ అంతర్జాతీయ సమాజం కానీ ఈ యుద్ధ కాంక్షను అస్సలు సహించదు. వేల ఏళ్ల నాటి సింధూ నాగరికతకు తాము వారసులమని మోదీ అంటుంటారు. కానీ ఈ సంస్కృతికి పరిరక్షకులము మేమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాము’’ అంటూ ఓ ర్యాలీలో మండిపడ్డారు.మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు పాకిస్థాన్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు బిలావల్ పేర్కొన్నారు. దానిలో భాగంగానే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేశారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో నదిని రక్షించుకునేందుకు, ఇండియాపై పోరాటం కొనసాగుతుందన్నారు. ఇండియా తన ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదన్నారు.