విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం
కొత్తగూడెం బహిరంగ సభలో నిరాధార ఆరోపణలు
పరువునష్టం పిటిషన్ వేసిన బీజేపీ నేత కాసం
ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న విచారణలు
ఆ కేసు కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లిన రేవంత్రెడ్డి
పిటిషన్ విచారణను జూన్ 12కు వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, ఆంధప్రభ : గత ఏడాది కొత్తగూడెం బహిరంగ సభలో నిరాధార ఆరోపణలు చేశారని రేవంత్ రెడ్డిపై బీజేపీ క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపించారని అందులో పేర్కొంది. దీంతో ఆ పార్టీ పరువుకు నష్టం కలిగిందని పిటిషనర్ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే దీనిపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టింది. రేవంత్ ప్రసంగించిన ఆడియో, వీడియో సాక్ష్యాలను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. కాసం వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని ప్రజాప్రతినిధుల కోర్టు నమోదు చేసింది. ఈక్రమంలో ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రాజకీయ ప్రసంగాలకు పరువు నష్టం ఉండదని అందులో పేర్కొంటూ పలు సుప్రీంకోర్టు తీర్పులను పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది. అలాగే కోర్టు హాజరు నుంచి రేవంత్ ను మినహయించింది..