Guntur ధమ్మరో ధమ్‌…. జోరుగా ఎండీఎంఏ అమ్మకాలు… నలుగురు అరెస్ట్


– జిల్లాలోకి ఎండీఎంఏ మత్తు పదార్ధం
– గంజాయి కన్నా అత్యధునిక డ్రగ్స్‌
– ఒక్కసారి పీల్చితే ఆరు గంటల వరకు మత్తు
– బెంగళూరు నుంచి తెచ్చి విజయవాడ, గుంటూరులో విక్రయాలు
– మంగళగిరి పోలీసులకు చిక్కిన ముఠా
– నలుగురు అరెస్ట్, పరార్‌లో మరో ఇద్దరు
– 8.71 గ్రాముల ఎండీఎంఏ, 1.2 కిలోల గంజాయి స్వాదీనం
– విలేకరుల సమావేశంలో వెల్లడించిన గుంటూరు లా అండ్‌ అర్డర్‌ ఏఎస్పీ రవికుమార్

గుంటూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ:
జిల్లాలో సరికొత్తగా మరో మత్తు పదార్ధం చాపకింద నీరులా చొరబడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో చాలా చోట్ల గంజాయి, అప్పుడప్పుడు కొకైన్, హెరాయిన్, వైద్యంలో వాడే మత్తు కలిగించే డ్రగ్స్‌ను మాత్రమే వాడకం ఉండేది. పోలీసులు చేస్తున్న దాడుల్లో సైతం అవే దొరికేవి. ముంబై, బెంగళూరు, చెన్నైలకు మాత్రమే పరిమితం అయిన ఎండీఎంఏ(మిథైలెనె డియోక్సి మెథాంఫేటమిన్‌) డ్రగ్స్‌ గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. విజయవాడను కేంద్రంగా చేసుకుని యువత బెంగళూరు నుంచి ఈ ఆధునిక డ్రగ్స్‌ను తెప్పించి తాము మత్తుగా పీల్చడమే కాకుండ కాసుల కోసం మరికొందరిని ఈ మహమ్మరికి బానిసలను చేస్తున్నారు.

నాలుగు రకాల ప్రొసెసింగ్‌ తర్వాత ఎండీఎంఏ బయటకు…
మిథైలెనె డియోక్సి మెథాంఫేటమిన్‌(ఎండీఎంఏ) అత్యాధునిక మత్తు పదార్ధంగా నార్కొటిక్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఆఫ్రిక దేశాల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది. అక్కడ నాలుగు రకాల ప్రొసెసింగ్‌ పద్ధతుల ద్వారా దీనిని తయారు చేస్తారు. తెల్లగా ఉండే ఈ మత్తు పదార్ధం చిన్న చిన్న ప్యాకెట్లగా మార్చి ఈజీగా రవాణా చేస్తుంటారు. ఈ పొడిని చేతి మీద వేసుకుని ముక్కు ద్వారా దీనిని లోపలికి తీసుకుంటారు. తల మొద్దుబారడం, గాలిలో తేలినట్లు ఉండటం, శరీరం స్వాదీనంలో ఉండక పోవడం, గమ్మతైన అనుభవం…అంటూ పీల్చినవారు భావిస్తుంటారు. ఒక్కసారి పీల్చితే మెదడు, శరీరంపై మూడు నుంచి ఆరు గంటల వరకు మత్తు ఉంటుంది. దీనిని సేవిస్తే శరీరం సత్తువ కోల్పోయి, నరాలు బలహీనంగా మారి పోతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కుక్కపిల్ల బంధం…డ్రగ్స్‌ బానిసగా మార్చింది……
గుంటూరు జిల్లాలోకి ఈ ఆఫ్రిక మహమ్మరి ఓ కుక్కపిల్ల విక్రయంతో గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. అవును ఇది నిజమే. గుంటూరు జిల్లా లా అండ్‌ అర్డర్‌ ఏఎస్పీ రవికుమార్ శనివారం మంగళగిరిలోని రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వెంకట్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలను తెలిపారు. మంగళగిరి మండలం కుంచనపల్లికి చెందిన గొర్ల గిరిష్‌రెడ్డి ఇన్‌స్టా పేజీ ద్వారా కుక్కపిల్లలను అమ్మే వ్యాపారం చేస్తుంటాడు. అతనికి బెంగళూరుకు చెందిన శ్యామ్‌ అలియాస్‌ షామీర్‌ పరిచయం అవుతాడు. కుక్కపిల్లను కొనేందుకు మంగళగిరి వచ్చిన శ్యామ్‌కు గిరిష్‌రెడ్డి స్నేహితులు విజయవాడకు చెందిన నందం నిఖిల్, బొట్ల వెంకట కాశివర్ధన్, పెండ్యాల సాయికుమార్‌లు పరిచయం అవుతారు. గంజాయి, ఇతర చెడు అలవాట్లు ఉన్న ఈ నలుగురుకు బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను తీసుకువచ్చి గ్రామకు రూ.5 వేల చొప్పున విక్రయించేవాడు.

వారు కొంత సేవించి, మరికొంత గ్రామకు రూ.10 వేల చొప్పున విక్రయించేవారు. అలాగే వీరికి సొహైల్‌ అనే వ్యక్తి కిలో రూ.8 వేల చొప్పున గంజాయిని విక్రయించేవాడు. గంజాయిని కూడా కొంత తీసుకుని మరికొంత చిన్న చిన్న ప్యాకెట్లగా మార్చి కిలోను రూ.15 వేల చొప్పున విక్రయించేవారు. ఇలా గంజాయి, ఎండీఎంఏ డ్రగ్స్‌ను మార్చి మార్చి స్నేహితులు తీసుకునేవారు. ఈనేపథ్యంలో గత నెల రంజాన్‌ రోజు 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను శ్యామ్‌ తెచ్చి నిఖిల్‌కు విక్రయించాడు. అందులో కొంత సేవించిన నిఖిల్‌ మిగిలిన దానిని మూడు ప్యాకెట్లగా తయారు చేశాడు. సొహైల్‌ చేసి కాశివర్ధన్, ఈనెల 4వ తేదిన ఎండీఎంఏ, గంజాయిని పంచుకునేందుకు నిఖిల్, కాశివర్ధన్, సాయికుమార్, గిరిష్‌రెడ్డిలు యర్రబాలెంలోని ఓ డాభా వద్దకు చేరుకున్నారు.

సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్‌ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకట్, సిబ్బంది మెరుపుదాడి చేసి నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.90 వేల విలువ చేసే 8.71 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, రూ.30 వేల విలువ చేసే 1.2 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నట్లు ఏఎస్పీ రవికుమార్ తెలిపారు. కేటీఎం బైక్‌ను కూడా సీజ్‌ చేశామన్నారు. ముద్దాయిలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సొహైల్, శ్యామ్‌లు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారినీ అరెస్ట్‌ చేస్తామన్నారు. ఇన్‌స్టాలో కుక్కపిల్లల వ్యాపారంలో రాణిస్తున్న యువకుడితో పాటు అతని స్నేహితులను చెడు స్నేహం వల్ల డ్రగ్స్‌ రవాణా చేసేవారిగా, సేవించేవారిగా మార్చిందని, పోలీసు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నేహాలను మంచికే ఉపయోగించుకోవాలని, చట్టవ్యతిరేఖ కార్యక్రమాలకు ఉపయోగిస్తే జైలు పాలు కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.l

పోలీసులకు ఎస్పీ అభినందన…
జిల్లాలో ప్రప్రథమంగా గుర్తించిన ఎండీఎంఏ డ్రగ్స్‌ను సీజ్‌ చేయడమే కాకుండ నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన మంగళగిరి రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వెంకట్, హెడ్‌ కానిస్టేబుల్స్‌ శ్యామ్‌కుమార్, శేఖర్, చలమరావు, కానిస్టేబుల్‌ సాగర్‌బాబు లను గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్‌ అభినందించారు. ఉత్తమ పనితీరు చూపిన వారికి రివార్డ్‌ను ప్రకటించారు.

బుల్లెట్‌పై ఈగల్‌..!


ఈ బుల్లెట్‌పై హెల్మెట్‌ పెట్టుకుని సమాన్యులుగా ఉన్న వారిద్ధరు పెద్ద పోలీస్‌ ఆఫీసర్లు. వెనుక కూర్చున్న వ్యక్తి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు నియమించిన ఎలైట్‌ యాంటీ–నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈగల్‌) చీఫ్‌ ఆకే రవికృష్ణ కాగా, నడుపుతున్న వ్యక్తి ఏపీఎస్పీ ఎస్పీ నగేష్‌. మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయిని పట్టుకోవడమే కాకుండ నలుగురును ఆరెస్ట్‌ చేశారు. ఈనేపథ్యంలో శనివారం వారిద్దరు బుల్లెట్‌పై హెల్మెట్లు పెట్టుకుని మంగళగిరికి వచ్చారు. నిందితులను విచారించారు. ఎండీఎంఏ డ్రగ్స్‌ను పరిశీలించారు. రూరల్‌ పోలీసులను అభినందించారు. అనంతరం బుల్లెట్‌పై తిరిగి వెళ్లిపోయారు. ఐజీ స్థాయి అధికారి సమాన్యుడులా రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *