సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :సుపరిపాలన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. పాలనలోని అన్ని రంగాల్లో ప్రభుత్వ జోక్యం మరింత తగ్గించేందుకు రెగ్యులేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తామని అన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన 9వ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో మాట్లాడుతూ.. సంచనల విషయాలను వెలువరించారు.
వందలాది ఫిర్యాదుల పర్వాన్ని తమ ప్రభుత్వం ముగించిందని, ఇప్పుడు జన్ విశ్వాస్ 2.0 ద్వారా, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రోత్సహించడానికి మరిన్ని పాత విధానాలను తగ్గించిందని మోదీ అన్నారు. సమాజంలో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలనేది తన నమ్మకమని, దీని కోసం రెగ్యులేషన్ కమిషన్ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం..
ఎన్డిఎ ప్రభుత్వం తన విధానాలతో ‘ఫియర్ ఆఫ్ బిజినెస్’ స్థానంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ని తీసుకురాగలిగిందని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో ప్రయివేట్ రంగం పాత్ర ఎంతో కీలకమైనదని గుర్తిస్తూ, అణుశక్తి, అంతరిక్షం, వాణిజ్య మైనింగ్, విద్యుత్ పంపిణీతో సహా అనేక కొత్త రంగాలను పెట్టుబడి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారతదేశం చురుకైన భాగస్వామి అవుతుందని, అందులో ప్రధాన పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ సంస్కరణల గురించి ప్రస్తావిస్తూ.. ఆస్తి హక్కులను కాపాడేందుకు స్వామిత్వ యోజనను ప్రారంభించామన్నారు.
చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్ కల్పించాం..ప్రపంచవ్యాప్తంగా, చాలా మందికి ఆస్తులకు చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్ లేదు. ఆస్తి హక్కులు పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే గత ప్రభుత్వం ఈ సమస్యను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ విధానం దేశాన్ని నిర్మించడంలో సహాయపడదు. అందుకే మేము ‘స్వమిత్వ యోజన’ ప్రారంభించాం అని ప్రధాని మోదీ అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ₹100 లక్షల కోట్ల విలువైన ఆస్తులకు విముక్తి కల్పించామన్నారు. గ్రామాల్లో ఇప్పటికే ₹100 లక్షల కోట్ల ఆస్తి ఉందని, అయితే అది దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడలేదని, ఆస్తి హక్కులతో గ్రామస్తులు ఇప్పుడు బ్యాంకు రుణాలు పొందగలుగుతున్నారని అన్నారు.డ్రోన్ సహాయంతో గ్రామాల సర్వే..డ్రోన్ సహాయంతో 3 లక్షల గ్రామాలను సర్వే చేశామని, సర్వే తర్వాత 2.25 లక్షల మందికి ఆస్తి కార్డులు ఇచ్చామని ప్రధాని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తి యజమానులకు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ను అందించడం ద్వారా గ్రామీణ భారతదేశాన్ని ఆర్థికంగా మార్చడం’ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. భూమి సరిహద్దుల కోసం అధునాతన డ్రోన్, జీఐఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా, ఈ పథకం ప్రాపర్టీ మానిటైజేషన్ను ప్రోత్సహిస్తోందని, బ్యాంకు రుణాలకు ప్రాప్యతను సులభతరం చేస్తుంది, ఆస్తి వివాదాలను తగ్గిస్తుందని, సమగ్ర గ్రామ-స్థాయి ప్రణాళికను ప్రోత్సహిస్తుందన్నారు.
“ప్రజల అవసరాలను తీర్చడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది, ఫలితంగా, 25 కోట్ల మంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడ్డారు. మనకు ఇప్పుడు దేశంలో నియో -మధ్యతరగతి ఉంది. మధ్యతరగతిని మరింతగా ఆదుకునేందుకు, మొత్తం మధ్యతరగతి వర్గాన్ని బలోపేతం చేయడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలను పెంచేందుకు మా ప్రభుత్వం జీరో ఆదాయపు పన్ను బాధ్యతను ₹7 లక్షల నుంచి ₹12లక్షలకు పెంచింది. చురుకైన, సున్నితమైన ప్రభుత్వం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి” అని ప్రధాని అన్నారు.
బ్యాంకింగ్ విధానంలోనూ మార్పులు..బ్యాంకింగ్ రంగం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ.. పదేళ్ల కిందట ఈ రంగం సంక్షోభంలో ఉందని, లక్షలాది మంది భారతీయులు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారని అన్నారు. “క్రెడిట్ యాక్సెస్ అత్యంత సవాలుగా ఉన్న దేశాలలో భారతదేశం ఉంది” అని అన్నారు. పాత బ్యాంకింగ్ విధానంలో రుణాలు పొందలేని వ్యక్తులకు సుమారు ₹32 లక్షల కోట్లు అందించిన ముద్రా యోజన ఉదాహరణను ఆయన ఉదహరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ₹1.25 లక్షల కోట్లకు పైగా లాభాన్ని నమోదు చేశాయని ఆయన వివరించారు.