(ఆంధ్రప్రభ, విజయవాడ) శ్రీ విశ్వాస నామ సంవత్సర చైత్రమాస పౌర్ణమి రోజున ఆది దంపతుల గిరి ప్రదక్షిణాసి అంత వైభవంగా కొనసాగింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టం.
శనివారం చైత్ర పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు. తప్పెట్లు, మహిళల కోలాట నృత్యములు, భజన బృందాల సంకీర్తనలతో పాటు వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగింది.
ఘాట్ రోడ్ అమ్మవారి గుడి, కుమ్మరి పాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టినగర్, కొత్త పేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు విశేషంగా ఈకార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు.