నలుగురు మంత్రులకు ఉద్వాసన…..?

నలుగురు మంత్రులకు ఉద్వాసన…..?

కొండా, జూపల్లి, పొన్నంపై వేలాడుతున్న కత్తి…!
అదే దారిలో కోమటిరెడ్డి…?
నవంబర్ 14 తరువాత ఎప్పుడైనా క్యాబినెట్ విస్తరణ…..
ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్……
మంత్రుల శాఖల లోనూ తప్పని మార్పులు……


ఆంధ్రప్రభ, గ్రేటర్ హైదరాబాద్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారా? ప్రస్తుతం ఉన్న నలుగురు మంత్రులకు ఉద్వాసన తప్పదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల అప్పుడు ప్రజల్లో ఒక నిర్ణయానికి కూడా వచ్చేశారు. అయితే ఈ 23 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పలు వివాదాలు, విమర్శలు వచ్చాయి. వాటిలో ఎక్కువ భాగం నలుగురు మంత్రుల కారణంగానే వచ్చాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మొదటి నుంచి ఆ నలుగురి పనితీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారట. కొందరు మంత్రులు అనసవరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ.. వివాదాలకు కారణం అవుతున్నారని రేవంత్ భావిస్తున్నారట. అందుకే ఈ సారి కేబినెట్ విస్తరణలో ఆ నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికి.. కొత్త వారికి చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేబినెట్‌లో ఉన్న నలుగురు మంత్రులు (Four ministers) తమ శాఖలపై కూడా పట్టు సాధించలేకపోయారట. పైగా ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటూ వివాదాలకు కారణం అవుతున్నారట. ఇప్పటికే వీరిని తొలగించే విషయమై పార్టీ హైకమాండ్‌తో కూడా రేవంత్ రెడ్డి చర్చించారని.. అటు వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. వేటు పడే మంత్రుల్లో కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్తో పాటు మరో మంత్రి ఉన్నట్లు తెలిసింది. అయితే నాలుగో మంత్రి ఎవరా అని కాంగ్రెస్ వర్గాల్లో కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ నలుగురిని తొలగించడం వల్ల పార్టీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? కేడర్ ఏమైనా వ్యతిరేకించే అవకాశం ఉందా అనే విషయాలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక సర్వే కూడా చేయించినట్లు తెలిసింది. కాగా.. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్న వారిని తొలగించడమే మంచిదనే అభిప్రాయం కేడర్‌లో ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదమైన మంత్రిగా కొండా సురేఖ (Konda Surekha) ముద్రపడ్డారు. మొదటి నుంచి ఆమె వ్యవహార శైలి కాస్త దురుసుగానే ఉండేది. అయితే ఇటీవల ఆమె చేస్తున్న విమర్శలు బూమరాంగ్ అవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులు కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో పాటు ఓఎస్డీ విషయంలో మంత్రి కూతురు వ్యాఖ్యలు పెద్ద రచ్చకే దారి తీశాయి. ప్రజల్లో కూడా ఆమె వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖా అతి జోక్యం కారణంగా ఇతర ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో ఉన్న విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ కలహాల కారణంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది.

ఒక ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో కొండా సురేఖ, రేవూరి ప్రకాశ్ రెడ్డి (Revuri Prakash Reddy) వర్గీయుల మధ్య జరిగిన వివాదం ఏకంగా పోలీస్ స్టేషన్‌కు చేరింది. మంత్రి హోదాలో సర్థి చెప్పాల్సిన కొండా సురేఖ.. ఏకంగా స్టేషన్‌లోనే పంచాయితీ పెట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైగా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు సురేఖ పెద్దగా కృషి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ గమనించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆమెను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారట. వాస్తవానికి సమంత విషయంలో వ్యాఖ్యలు చేసిన సమయంలోనే ఆమెను తప్పిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అప్పటికి వివాదం సద్దుమణగడంతో ఎలాంటి చర్య తీసుకోలేదట. కానీ ఈ సారి మాత్రం ఆమెకు ఉద్వాసన తప్పదనే చర్చ జరుగుతోంది.

ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తో కలిసి పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే హోదాలో జూపల్లికి మంత్రి పదవి దక్కింది. అయితే ఆయన ఆశించిన మేర పని చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. జూపల్లి పని తీరుపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కూడా జూపల్లి సమన్వయం చేసుకోలేక పోయరని.. ఆయన వైఖరి పట్ల జిల్లా నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇక జూపల్లి తన శాఖపై పట్టు కోల్పోయారని.. ఇటీవల యూబీ గ్రూప్ తెలంగాణ నుంచి కింగ్ ఫిషర్ బీర్లను ఉపసంహరించుకున్న వ్యవహారాన్ని సరిగా డీల్ చేయలేకపోయారని రేవంత్ భావిస్తున్నారట. దీంతో పాటు శాఖలోని ఓ అధికారి కి సంబందించిన విషయంలోనూ సరిగా వ్యవహరించిన తీరు పై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)కి మంత్రి పదవి ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు. ఇదే జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరిది రెడ్డి సామాజిక వర్గం. ఒకే ఇంటి నుంచి రెండు మంత్రి పదవులు ఇస్తే తన భార్య పద్మావతిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇక నల్లగొండ జిల్లా నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సైతం లంబాడి వర్గం నుంచి కేబినెట్ లో బెర్త్ కోసం ఆశగా ఉన్నారు. ఇటీవల మైనార్టీ కోటాలో అజారుద్దిన్ కు మంత్రి పదవి వరించగా ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు, మైనార్టీ సంక్షేమ శాఖ ను అప్పగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన ప్రేంసాగర్ రావు , నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్ది కూడా తనకు మంత్రి పదవిని ఆశించినా ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ బై పోల్‌ ఫలితాల తర్వాత విస్తరణ చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ కసరత్తులో కొత్తగా నియమితులైన నలుగురు మంత్రులకు మినహాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply