వెలగపూడి : సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం మరో నాలుగు నెలల పాటు పొడిగించింది. ఆగస్ట్ 28 వరకు సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రివ్యూ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లినట్టు ఆరోపణలున్నాయి.
గత వైసీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండానే ఆయన తరచుగా విదేశాల్లో పర్యటించారు. ఒకటి, రెండు సార్లు ఆయన అనుమతి తీసుకున్నప్పటికీ… ఆయా దేశాలకు కాకుండా వేరే దేశాలకు వెళ్లారు. దుబాయ్ కి రాకపోకలు సాగించారు. ఇవన్నీ కూడా అనుమతులు లేని పర్యటనలే అని రివ్యూ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.
జార్జియాకు వెళుతున్నానని అనుమతి తీసుకుని నేరుగా ఆయన యూఏఈకి వెళ్లేవారు. అమెరికాకు వెళ్తున్నానని చెప్పి యూకేకి వెళ్లారు. వైసీపీ హయాంలో సునీల్ కుమార్ ఈ మాదిరి ఆరుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లినట్టు విచారణలో తేలింది. దీంతో ఆయనను చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఇంతకు ముందే సస్పెండ్ చేశారు. తాజాగా ఆయన సస్పెన్షన్ ను పొడిగించారు.