ఆంధ్రప్రభ, ఇంద్రవెల్లి : రైతులు తమ పంట పొలాల్లో పండించే పంటలకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే మేలు చేకూరుతుందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామంలోని రైతు వేదిక భవనంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులు రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయ సాగుపై దృష్టి సారించాలన్నారు. రసాయనాల వాడకం వల్ల భూకాలుష్యం పెరిగి, మానవ మనుగడకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పురాతన కాలంలో పండించిన పంటలను మళ్ళీ సాగు చేయాలని సూచించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా కాకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.