Exclusive | అనకాపల్లిపై అణు రాబంధు..

తెరమీదకు 2000 ఎకరాల భూ సేకరణం
మరో కొవ్వాడ కథ ఖాయం
రాష్ట్ర‌ ప్రభుత్వానికి కేంద్రం తాయిలం
ఇప్పటికే పరవాడతో సతమతం
అణు విద్యుత్తే ఎందుకు? సౌరశక్తితో సాధించలేమా?
మేధావి వర్గంలో తీవ్ర వ్యతిరేకత

అనకాపల్లి బెల్లం.. మథురాతి మథురం. ఈ బెల్లం ముక్క నోట్లో పడితే ఔరా అని జిహ్వలూరాల్సిందే. ఇదేం ఖర్మమో.. సాధారణంగా బెల్లం చుట్టూ ఈగలు వాలుతాయి. పోనీలే అని వదిలేసినందుకు.. తాజాగా అనకాపల్లి జనాన్ని పీక్కుతినేందుకు కాలుష్య గద్దలు వాలిపోతున్నాయి. ఇప్పటికే పరవాడలో చేదుమాత్రల తయారీ కేంద్రాలు వెలిసి.. వీలుచిక్కినప్పుడల్లా జనాన్ని చంపేస్తున్నాయి. పరవాడ అంటే.. ప్రాణాలు తోడే పారిశ్రామికవాడగా జనం గుండెలు బాదుకునే స్థితి. కానీ తాజాగా అనకాపల్లిని ధ్వసం చేయటానికి మరో రాబంధు రెక్కలు రెపరెపలాడిస్తోంది. 2000 ఎకరాల్లో అణు ధార్మిక కేంద్రం రూపంలో వాలిపోతోంది. అనకాపల్లి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరిట భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం తెగ ఉబలాట పడుతోంది. తాయిలాలతో రాష్ట్ర‌ ప్రభుత్వానికి ఎరలు వేస్తోంది. శ్రీకాకుళం కొవ్వాడ జనం గతే అనకాపల్లికి దాపరిస్తోందని.. దయచేసి ఈ ప్లాన్ కు అంగీకరించవద్దని మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఈఏఎస్ శర్మ మొత్తుకొంటున్నారు. ఔను.. అణుధార్మిక విద్యుత్తు కేంద్రంతో భారత దేశంలో వెలుగుల పూల వాన కురుస్తుంది కదా.. ఇదే జరిగితే దేశం అభివృద్దిలో అతివేగంగా దూసుకుపోతుంటే.. ఈ శాపనార్థాలేంటీ? అనే ప్రశ్నలు సర్వసాధారణం. కానీ అణుధార్మిక విద్యుత్తు కేంద్రం ఏర్పడితే.. అనకాపల్లి జనం బతుకు బహూ హీనం అని మేధావి వర్గం హెచ్చరిస్తోంది.

(ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్) : ఉత్తరాంధ్ర ప్రజలను మరో అణుధార్మిక విద్యుత్తు కేంద్రం వెంటాడుతోంది. ఇప్పటికే కొవ్వాడ ప్లాంట్ నిర్మాణ ప్రక్రియపై విరుచుకుపడిన ఉత్తరాంధ్ర ప్రజానీకం మరో ఉద్యమానికి సన్నద్ధమయ్యే పరిస్థితులు తప్పటం లేదని మేధావి వర్గం హెచ్చరిస్తోంది. అనకాపల్లి థర్మల్ పవర్ స్టేషన్ కబురు ఉత్తరాంధ్రను కలవరపెడుతోంది. అనకాపల్లిలో 2,800 మెగావాట్ల సామర్థ్యంతో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ బాధ్యతను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అప్పగిస్తోంది. ఈ ప్రాంతంలో ఇందుకు కనీసం 2,000 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమాచారం మీడియాలో హల్ చల్ కావటంతో ఉత్తరాంధ్ర ప్రజానీకం ఉలిక్కిపడింది. తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది.

తెరమీదకు కొవ్వాడ గుణపాఠం
సుమారు పదేళ్ల కింద, శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 6,000 మెగావాట్ల సామర్థ్యంతో అణుధార్మిక విద్యుత్తు కేంద్రం నిర్మాణ బాధ్యతను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేపట్టింది.ఇందుకు సుమారు 2,000 ఎకరాల సస్యశ్యామలమైన వ్యవసాయ భూమిని, రాష్ట్రప్రభుత్వం సహాయంతో సేకరించి, రెండువేల కుటుంబాలను, ముఖ్యంగా సాంప్రదాయ మత్స్యకారులను, నిర్వాసితులు చేసి, నిరుపేద కుటుంబాల జీవితాల్లో భయానక వాతావరణం సృష్టించింది. కానీ ఇక్కడి జనం ఈ ఆ ప్రాజెక్టు పనులకు వ్యతిరేకంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా ఇప్పటి ఈ పనులు ప్రారంభం కాలేదు. ఎప్పుడు పనులు ప్రారంభిస్తే.. అప్పుడు ప్రభుత్వానికి తగిన శాస్తి చెప్పటానికి జనం సిద్ధంగా ఉన్నామని ఉత్తరాంధ్ర జనం రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు.

రెండింతలకు పైగా సామర్థ్యం ఉన్న కొవ్వాడ ప్రాజెక్టు తో పోల్చి చూస్తే, అనకాపల్లి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు కోసం, ఎన్టీపీసీ, 2,000 ఎకరాల భూమి కావాలని అనడం సబబుగా లేదు. పైగా, అటువంటి ప్రాజెక్ట్ కోసం, రోజుకు 3 00 కోట్ల గాలనుల నీరు కావాలని అనడం కూడా సమంజసం కాదు. పోలవరం ప్రాజెక్టు నుంచి లభ్యమయ్యే నీరు వచ్చిన తర్వాత కూడా, విశాఖ అనకాపల్లి ప్రాంతంలో నీటి కొరత ఉండగలదు. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని, ఎన్టీపీసీ తీర ప్రాంతంలో, సముద్రం నీటిని శుద్ధి పరిచే సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి.

ఇక ఫుకుషిమా స్థితే
న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు ఎంత ప్రమాదకరమో, జపాన్ లో ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు లో, 2011 లో జరిగిన అతి ఘోరమైన ప్రమాదం తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్పష్టంగా అవగాహన వచ్చింది. ఆ ప్రమాదం కారణంగా, చాలా మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, లక్ష మంది ప్రజలు నిర్వాసితులు అయ్యారు. ప్రమాదానికి గురి అయిన న్యూక్లియర్ రియాక్టర్ల నుంచి రోజూ వస్తున్న వేల టన్నుల అణుధార్మిక జలాలను, ఈ రోజు వరకు జపాన్ ప్రభుత్వ సంస్థలు శుద్ధి చేయలేక పోతున్నాయి. అప్పుడే అణుధార్మిక కాలుష్యానికి గురి అయిన 5 లక్షల టన్నుల జలాలు, పసిఫిక్ మహా సముద్రంలో కలిసాయి. ఈ రోజు అంచనాల ప్రకారం, 2011 లో ప్రమాదం జరిగిన రియాక్టర్లను పూర్తిగా శుద్ధి చేయాలంటే, 2050 సంవత్సరం వరకు సాధ్యం కాదు. అందుకు 18000 కోట్ల డాలర్లు ఖర్చు అవ్వగలదని జపాన్ ప్రభుత్వం అంచనా వేసింది. కాని నిపుణుల అంచనాల ప్రకారం, రియాక్టర్ల శుద్ధి ఇంకొక 30-.. 40 సంవత్సరాలు పడుతుంది. ఖర్చు అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి . ఒకవేళ అటువంటి ప్రమాదం జరిగితే, అందువలన కావాల్సిన ఖర్చు భరించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఫుకుషిమా వంటి ప్రమాదం, కొవ్వాడ, అనకాపల్లి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ల లో, ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని గుర్తించాలి, అని మాజీ ఐఏఎస్ అధికారి డాక్డర్ ఈఏఎస్ శర్మ హెచ్చరించారు.

సోలార్ పవర్ తో .. ఎంతో లాభం..
కొవ్వాడ, అనకాపల్లి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ల లో కలిగే ఉద్యోగ అవకాశాలు అంతంతే.. స్థానికులకు ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. ఆ ప్రాజెక్టులను తయారుచేసే సంస్థలు విదేశాల్లో ఉండటం వలన, ఆయా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయి. అంత ప్రమాదకరమైన న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి సామాన్య ప్రజలకు అందుబాటులో లేని ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసే బదులు, ప్రతి గ్రామంలో, ఒక మెగావాట్ కు కావాల్సిన రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను, సోలార్ ఇరిగేషన్ పంప్ సెట్లను ప్రజలకు అందచేస్తే, వారి అవసరాలకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసుకుంటూ, డిస్కాంలకు మిగులు ఎలక్ట్రిసిటీ ని అమ్మి, అదనంగా ఆదాయం ఆర్జించే అవకాశం కలుగుతుంది. అదే కాకుండా, కేంద్రీకృతమైన న్యూక్లియర్ పవర్, సోలార్ ప్లాంట్ ల కారణంగా, ట్రాన్స్మిషన్ వైర్ల లో వ్యర్థం అయ్యే ఎలెక్ట్రిసిటీని పొదుపు చేసుకోవచ్చు.పైన సూచించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులు, కేంద్రీకృతమైన సోలార్ ప్లాంట్ ల బదులు, సోలార్ రూఫ్ టాప్, సోలార్ ఇరిగేషన్ పంపుసెట్లు ప్రజలకు సులభంగా అందచేసి, వారు ఉత్పత్తి చేసే మిగులు ఎలక్ట్రిసిటీ ని గిట్టుబాటు ధరకు డిస్కామ్ లకు అమ్మే పథకాన్ని చేపడితే, అందువలన లక్షలాది మంది ప్రజలు లాభపడతారు. అటువంటి పథకాన్ని ఆలస్యం చేయకుండా చేపట్టాలని, అనకాపల్లి లో నిర్మిస్తామని ముందుకు వచ్చిన ఎన్టీపీసీ ప్రతిపాదికను ఆమోదించకూడదని మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఐఈఎస్ శర్మ అభ్యర్థిస్తున్నారు.

Leave a Reply