చత్తీస్ గడ్ – బీజాపూర్ లో నేడు మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో తెలంగాణకు చెందిన మరొక కీలక నేత అడెల్ల అలియాస్ భాస్కర్ మృతి చెందినట్లు సమాచారం. కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు నేత భాస్కర్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు . నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య మళ్ళీ భీకర ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మరో నక్సల్ నాయకుడు హతమయ్యాడు. సంఘటన స్థలంలో ఎకె 47 తో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హతుడి వద్ద ఎ కె 47 ఉండటంతో మావోయిస్ట్ కీలకనేతగా గుర్తించారు పోలీసులు. ఇక భాస్కర్ తలపై రూ.25 లక్షలు రివార్డ్ ఉంది.. ఎపి, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ గడ్, ఝార్ఖండ్ లలో జరిగిన పలు హింసాత్మక ఘటనలో భాస్కర్ కు భాగస్వామ్యం ఉందంటున్నారు అధికారులు.
ఇది ఇలా ఉంటే మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత నెల 21న బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దు అబూజ్మడ్లో జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ఏరియాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత, కేంద్ర కమిటీ (సీసీ) సభ్యుడు తెంటు లక్ష్మీనర్సింహాచలం(65) ఎలియాస్ గౌతమ్ ఎలియాస్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎదురుకాల్పులను బస్తర్ ఐజీ సుందర్రాజ్ ధ్రువీకరించారు. అంతలోనే మళ్లీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న ఓ కీలక నేత హతమయ్యాడు.