సిక్కిం – ఈశాన్య భారతదేశంలోని ఉత్తర సిక్కింలో ప్రకృతి వైపరీత్యం కారణంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. మున్షితాంగ్ ప్రాంతంలోని లాచెన్-చుంగ్తాంగ్ రోడ్డు, లెమా/బాబ్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ విపత్తు సంభవించింది. గాంగ్టక్ నుండి చుంగ్తాంగ్ వరకూ సుమారు 100 కి.మీ. ప్రాంతంలో నిరంతర వర్షాలు కురుస్తున్నందున పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆయా ప్రాంతాలకు సందర్శకులకు అనుమతిని రద్దు చేశారు అధికారులు.
కొండచరియలు విరిగిపడిన కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు వేయి మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని పోలీసు అధికారులు ధృవీకరించారు. కఠినమైన వాతావరణ పరిస్థితులు, కొండచరియలు విరిగిపడటం వల్ల చుంగ్థాంగ్లో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు 200 పర్యాటక వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో అధికారులు ప్రయాణికులను సమీపంలోని గురుద్వారాకు తరలించి బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకూ ఉత్తర సిక్కింకు పర్యాటకులను పంపవద్దని అధికారులు అన్ని టూర్ ఆపరేటర్లను ఆదేశించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితులు మెరుగుపడే వరకు సందర్శకులు, స్థానికులు నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అలాగే పర్యాటలకు ఎవరూ కూడా సిక్కింకు రావద్దని కూడా సూచించారు.