Tuesday, October 8, 2024

HYD : ఏడ్చేవాళ్లు ఏడుస్తూనే ఉండనీ.. అమ్మ ప్రతీ ఉత్సవానికి పుస్తక పరిమళమై వస్తున్న పురాణపండ

హైద‌రాబాద్ : ఏడ్చేవాళ్లు ఏడుస్తూనే ఉంటారు. విమర్శించే వాళ్లు విమర్శిస్తూనే ఉంటారు. వాళ్లను అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ల జీవితం అంతే. వాళ్లెప్పటికీ బలవంతులు కాలేరు. నీ మహోన్నత లక్ష్యం వైపు నువ్వు బలంగా ప్రయాణించు అని నీ లక్ష్యం ఈ చెత్త తుఫాన్లను చెల్లాచెదురు చేస్తుంది. నా జీవితంలో ఎందరినో చూశాను. వాళ్లు బలవంతులనుకుంటారు. వాళ్లది బుడగ బలం అంతే. నీ పయనంలోని నిస్వార్థత, స్వచ్ఛత, పవిత్రతకు కాలం సహకరిస్తుంది. నీ అర్థవంతమైన ప్రయాణం నీకు పరమాత్మ అనుగ్రహాన్ని వర్షింపచేస్తుంది. నీ బలం మహాబలంగా మారి పదిమందికి మేలు చేసే ఆయుధంగా నిన్ను మారుస్తుంది. అయితే నీ ప్రయాణం ఎవ్వరికీ హాని కలిగించకూడదు. అస్సలు మర్చిపోకు.. అని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అపురూప ఆధ్యాత్మిక రచనలు, సంకలనాల ప్రచురణ, ప్రచారోద్యమంలో దూసుకుపోతోంది పురాణపండ శ్రీనివాస్ మాత్రమేనని, వైదిక మార్గంలో నిస్వార్థంగా ఒక యజ్ఞ భావనతో ప్రయాణిస్తున్న ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ గొప్ప జ్ఞాన వైభవాలు నింపుకున్న చాలా మంచి వక్త అని, అయితే ఏ కారణం చేతనో సభలు, సమావేశాలకు దూరంగా వుంటున్నారని, ఇకనైనా తాను అనుభూతి చెందిన మంత్రశాస్త్ర ప్రభావాలను, ఆర్ష భారతీయ కథా వైభవాలను విస్తృతంగా సభావేదికలపై శ్రీనివాస్ తన వాగ్వైభవంతో ఆవిష్కరించాలని పూర్వ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డా.కేవీ.రమణాచారి నాలుగైదు సార్లు త్యాగరాయ గానసభ, రవీంద్రభారతి సభల్లో సైతం చెప్పడాన్ని హైదరాబాద్ మీడియా కోడై కూసింది కూడా.

- Advertisement -

ఏదేమైనా తెలుగు రాష్ట్రాల దేవస్థానాల్లో, వేలకొలది ఆలయాల్లో పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంథాల వైభవమే తొలి వరుసలో కనిపిస్తోంది. కొందరు మహాపండితులు, ప్రవచనకారులు తమ ఉపన్యాసాల బయట తమ మనుషుల్ని పెట్టి బుక్స్ అమ్మించుకుంటున్న ఈ రోజుల్లో సైతం ఏమీ ఆశించకుండా శ్రీనివాస్ ఇంతటి మహోత్తమ కార్యాలను భుజాలకెత్తుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ కేఎస్.రామారావు పర్యవేక్షణలో పురాణపండ శ్రీనివాస్ అందించిన అమ్మవారి అపురూప గ్రంతం శ్రీనిధి లక్ష ప్రతుల వితరణకు దుర్గమ్మ సన్నిధిలో శ్రీకారం చుట్టడం మంగళపరిణామమే మరి. ఇంతమంది పండిత కవులు, రచయితలున్నా ఈ భాగ్యం పురాణపండ శ్రీనివాస్.కి దక్కడానికి ఆయన నిస్వార్థ హృదయం, స్వచ్ఛమైన సేవ, రచనా సౌందర్యం, నాణ్యతా ప్రమాణాల ముద్రణ అలాంటివని మేధో సమాజం ముక్తకంఠంతో ఎలుగెత్తుతోంది. పురాణపండ శ్రీనివాస్ కృషిని చూసి అసూయ పడుతున్న వారూ వున్నారు. శ్రీనివాస్ ఏమీ లెక్క చెయ్యరు. తాను చేస్తున్న కార్యం మేలు చేకూర్చేదా, కాదా అనే ఆలోచిస్తారు. తన ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తన గమ్యం, ధ్యేయం, ప్రయాణం భగవత్ కృపకోసమే అనేది మనకే స్పష్టంగా తెలిసి పోతుంది. ఏమీ ఆశించకుండా పవిత్రోన్ముఖంగా శ్రీనివాస్ ప్రయాణిస్తుండం వల్లనే ఎందరో స్పాన్సర్స్ పురాణపండ శ్రీనివాస్ కి అండగా నిలుస్తున్నారనేది కఠినాతి కఠినమైన సత్యం.

సీనియర్ ఐఏఎస్ అధికారులు కేవీ.రమణాచారి, ఎల్వీ.సుబ్రహ్మణ్యం, యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ ఆథారిటీ చైర్మన్ కిషన్ రావు , కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, తెలంగాణ శాసనసభ్యులు, బసవతారకం హాస్పిటల్స్ చైర్మన్, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ , వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి, సాగర్ సిమెంట్స్ అధినేత శ్రీకాంత్ రెడ్డి, కోస్తాజిల్లా వర్తక సంఘాల సమాఖ్య అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. ఇలా ఎంతోమంది సంపూర్ణ సౌజన్యం బడటం మామూలు విషయం కాదు. కనకనే ఇప్పటికీ అనేక ధార్మిక కార్యక్రమాల్లో శ్రీనివాస్ గ్రంథాలకే ప్రథమ తాంబూలాన్ని దైవం అనుగ్రహిండం శ్రీనివాస్ పురాకృత జన్మ సుకృతమ్ గా చెప్పాల్సిందేనంటున్నారు మేధో సమాజపు విజ్ఞులు.

ఐదు సంవత్సరాలుగా దేవీ నవరాత్రోత్సవాలకు యుగే..యుగే, మహా మంత్రస్య, మహా సౌందర్యం, శ్రీపూర్ణిమ, శ్రీమాలిక, పచ్చకర్పూరం, సౌభాగ్య, తల్లీ నిన్ను దలంచి, శ్రీనిధి.. ఇలా ఎన్నో అపురూప అక్షరమంత్రం కలశాల్ని పురాణపండ శ్రీనివాస్ భక్త కోటికి ఉచితంగా శరన్నవ రాత్రోత్సవాల్లో అందించడం కేవలం శివానుగ్రహంగా పేర్కొంటున్నారు.
ఈ సంవత్సరం కూడా బెజవాడ కనకదుర్గమ్మ చెంత శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానముల డిప్యూటీ కలెక్టర్ కెఎస్.రామారావు పర్యవేక్షణలో అద్భుతంగా జరుగుతున్న అఖండ కుంకుమార్చనల్లో, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ అసాధారణ దేవీనవరాతుల్లో సైతం ప్రత్యేకార్చనల్లో పాల్గొన్న వారికి శ్రీలలిత విష్ణు గ్రంథాన్ని అర్చకులు అందిస్తుండగా, కాకినాడలో లక్షలాది భక్తుల ఇలవేల్పు శ్రీబాలాత్రిపుర సుందరీ దేవాలయంలో సుమారు మూడు వందల యాభై పేజీల సహస్ర మంగళగ్రంథాన్ని భక్తకోటికి కానుకగా పంచడం శ్రీనివాస్ రచనా సౌందర్య సమర్థతకు, యజ్ఞభావనకు, నిస్వార్థతకు ఎత్తిన వైజయంతికగా చెప్పక తప్పదు.

రాజమహేంద్రవరం దేవీచౌక్.లో సౌభాగ్య గ్రంథ పవిత్ర సందడి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇంతేకాకుండా భీమవరం శ్రీమావుళ్ళమ్మ సన్నిధానంలో సైతం శ్రీరాజరాజేశ్వరి దివ్యగ్రంథాన్ని ముత్తయిదువులకు సమర్పించడం వెనుక పురాణపండ అఖండ దివ్య సమర్పణా కృషి ఉందని భక్తులు ప్రశంసించడం చరిత్రలో నిలిచి పోతుంది. బెజవాడ దుర్గమ్మ మూల పూజల్లో ప్రధానమైన మహా సరస్వతీ పూజ రోజుకు మరొక ప్రత్యేక విశేష గ్రంథాన్ని అందిస్తున్నట్లు ఆలయ అర్చకులు సంతోషంతో చెబుతున్నారు.

జీవనయాత్రలో ఎన్నో కష్టాలకు ఎదురీదిన శ్రీనివాస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పవిత్ర గ్రంథశోభతో దేశం ఎల్లలుదాటి దేశదేశాల తెలుగు లోగిళ్లకు మంత్రం చైతన్యమై పరిమళించడం మహోన్నత విషయమని విఖ్యాత నటులు, ప్రముఖ రచయిత తనికెళ్ళ భరణి సైతం ప్రశంసలు వర్షించడం శ్రీనివాస్ స్వయంకృషి మంత్రానికి అమ్మవారి అనుగ్రహం తోడవ్వడమేనని పెద్దతరాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement