Wednesday, October 9, 2024

తిరుమల సౌందర్యాల లావణ్యమే పురాణపండ హరే హరే

విజయవాడ, (ప్రభ న్యూస్‌) : ఒకవైపు తిరుమల బ్రహ్మోత్సవాలు, మరొకవైపు బెజవాడ కనక దుర్గమ్మ శరన్నవ రాత్రోత్సవాలు, ఈ రెండు అఖండ శ్రీకార్యాల్లో రేయింబవళ్లు అవిశ్రాస్త్రంగా పాల్గొంటూ పవిత్రమయంగా జరగడానికి అమ్మవారి అనుగ్రహంతో దేవాదాయ శాఖా మంత్రిగా అద్భుత పాత్ర వహిస్తున్న ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం దుర్గమ్మ సన్నిధానంలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్‌ అమోఘ రచనా సంకలనం హరే హరే ఏడేడు లోకాలనేలే ఏడుకొండల వాడి పారవశ్యపు గ్రంథాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సర్వసంపదలకూ ఆధారమైన శ్రీమహాలక్ష్మీ అర్చనా వైభవం పవిత్ర నవరాత్రి ఉత్సవరోజున ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ తిరుమల శ్రీనివాసుని కటాక్షాన్ని వర్షించే మహాద్భుత గ్రంథాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టమన్నారు.

శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్‌ రామారావు చొరవతో ఈ సంవత్సరం మూడు అపూర్వ గ్రంథాలను సుమారు రెండు లక్షల ప్రతులను సౌభాగ్య, శ్రీనిధి పారవశ్యపు మంత్రం నిధులుగా అందించడం వెనుక పురాణపండ శ్రీనివాస్‌ పవిత్ర మహా సంకల్పాన్ని పలువురు పండితులు, అర్చకులు, రాజకీయ ప్రముఖులు అభినందించారు.

పురాణపండ శ్రీనివాస్‌కి కనకదుర్గమ్మ కటాక్షం పుష్కలంగా ఉండటం వల్లనే ఈ మహా కార్యాలు సాధ్యమై లక్షల భక్తుల సంతోషానికి కారణమౌతోందని దేవస్థాన డిప్యూటీ కలెక్టర్‌ రామారావు పేర్కొన్నారు. మహా సరస్వతీ దేవతానుగ్రహం కోసం దేశవ్యాప్తంగా సరస్వతీ అర్చనలు చేసే బుధవారం ఇంద్రకీలాద్రిపై మరొక మంగళ విశేష గ్రంథాన్ని, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ దేవీం స్మరామి పేరిట అమ్మవారి విశేష లావణ్యంగా భక్తులకు సమర్పిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోతో, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, దేవస్థానం డిప్యూటీ కలెక్టర్‌ కెఎస్‌.రామారావు ప్రోత్సాహంతో విఖ్యాత పారిశ్రామికవేత్త, కిమ్స్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ బొల్లినేని క్రిష్ణయ్య సౌజన్యంతో సౌందర్యాలతో ఈ అక్షర కలశం బుధవారం అమ్మ పాదాల చెంత ఆవిష్కరించబడుతున్నట్లు- సమాచారం. మరొక ప్రక్క తిరుమల గరుడ సేవలో మాడ వీధుల్లో ఈ పురాణపండ హరే హరే గ్రంథాన్ని తిరుమల ఉన్నతాధికారులకు, ఆలయ అర్చక పండితులకు కిమ్స్‌ బృందం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement