Sunday, September 8, 2024

Shirdi – తిరుమలను మించి షిర్డీ సాయి నాథునికి ఆదాయం

ఆంధ్రప్రభ స్మార్ట్ – షిర్డీ ప్రతినిధి – : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశుడి ఆదాయంతో శిర్డీ సాయికి పోటీ ఏర్పడింది. గురుపూర్ణిమ సందర్భంగా ఈ నెల 20న ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజులపాటు జరిగాయి. ఒక్క రోజే శిర్డీ సాయికి రూ.6 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. భక్తుల నుంచి విరాళాలు వివిధ రూపాల్లో ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ గోరక్షా గాడిల్కర్ మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారని తెలిపారు.

“ గురుపూర్ణిమ సందర్భంగా ఆలయానికి రూ. 2 కోట్ల 50 లక్షలకుపైగా నగదు వచ్చింది. రూ. కోటికి పైగా విరాళం సమకూరగా, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, ఆన్‌లైన్ విరాళాలు, చెక్కులు, మనీ ఆర్డర్‌ల ద్వారా సుమారు రూ. 2 కోట్ల విరాళాలు అందాయి. కొంతమంది భక్తులు రూ. 10 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండిని విరాళంగా ఇచ్చారు. లడ్డూ కవర్ల విక్రయం ద్వారా ఆలయ ట్రస్టు రూ.62 లక్షలకు పైగా వసూలు చేసింది. ప్రత్యేక క్యూలో వెళ్లి బాబాను త్వరగా దర్శించుకోవాలనుకునేవారికి రూ. 200 ప్రత్యేక టికెట్లు జారీ చేశాం” అని గాడిల్కర్ పేర్కొన్నారు.

- Advertisement -

మూడు రోజుల పండుగ సందర్భంగా శిర్డీ పట్టణం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల ప్రధాన రోజైన జులై 21న జపాన్‌కు చెందిన 18 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి బాబా ఆశీస్సులు తీసుకున్నారు. వీరంతా గత 10 సంవత్సరాలుగా ఏటా శిర్డీని దర్శించుకుంటున్నారు.

ఉత్సవాల సందర్భంగా సాయి ప్రసాదాలయంలో లక్ష 90 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులను కల్పించామని ఆయన అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రంలో 5 వేల మందికి పైగా భక్తులకు చికిత్స అందించామని, కొందరు రక్తదానం కూడా చేసినట్లు వివరించారు

.థీమ్ పార్క్ కోసం రూ.40 కోట్లు..

సాయిబాబా జీవితం ఆధారంగా థీమ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు శిర్డీ పురపాలక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. ఈ థీమ్ పార్క్‌లో సాయిబాబా జీవితం గురించి లేజర్ షో ఏర్పాటు చేస్తారు. దాదాపు 22 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రూపొందనుంది. ఇది శిర్డీని సందర్శించే భక్తులకు అదనపు ఆకర్షణగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement