Friday, September 20, 2024

రాజశ్యామల నవెూస్తుతే!

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: లోకకల్యాణం కోసం శారదా పీఠంలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. బుధవారంనాడు విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన సీఎం దాదాపు మూడున్నర గంటలపాటు వైదిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. 11.50 నిముషాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విశాఖ శ్రీ శారదాపీఠానికి చేరుకున్నారు. వేదమంత్రోశ్చరణలు, మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ ముఖ్యమంత్రిని పండితులు సాదరంగా స్వాగతించారు. అనంతరం పీఠం ప్రాంగణంలోనే ముఖ్యమంత్రి సాంప్రదాయ దుస్తులు ధరిం చారు. తరువాత ముఖ్యమంత్రి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తదుపరి పీఠాధిపతులతో కలిసి రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. పీఠం ప్రాంగణంలోనే ఉన్న విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ప్రతిమలకు ముఖ్యమంత్రి పూజలు చేసారు. అక్కడి నుంచి రాజశ్యామల అమ్మవారి ప్రత్యేక యాగం కోసం ఏర్పాటు-చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మో హన్‌ రెడ్డితో తొలుత పండితులు సంకల్పం చెప్పించారు. అనంతరం కలశ స్థాపన చేసి పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి పాల్గొన్న రాజశ్యామల అమ్మవారి పూజా కార్యక్రమం సుమారు 45 నిమిషాలపాటు కొనసాగింది. వేదపండితులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు అర్చకులు వేదమంత్రోశ్చరణలతో శారదాపీఠం అంతా వేదఘోషతో మారుమ్రోగింది. ముఖ్యమంత్రి అద్యంతం భక్తిశ్రద్ధలతో ఈ యాగంలో పాల్గొన్నారు.
వేద విద్యార్థులకు పట్టాలు
అనంతరం విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ముఖ్యమంత్రి చేతులు మీదుగా పట్టాలు అందించారు. రుగ్వేదం, యజుర్వేదం, స్మార్తం విభాగాల్లో పరీక్షలు రాసిన విద్యార్థులుు ఈ పట్టాలను పొందారు. ప్రతిభ, పాటవాలు కనపరచిన విద్యార్ధులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మెడల్స్‌ వేసి సత్కరించారు. సీఎంకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వాములు పట్టు- వస్త్రాలను అందించి శాలువతో సత్కరించారు. అనంతరం పీఠం ప్రాంగణంలోని చంద్రమౌళీశ్వరులకు సీఎం అభిషేకం చేసారు. సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అలాగే లోక కళ్యాణార్థం విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహించిన రుద్రహోమం పూర్ణాహుతికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఆతర్వాత రాజశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కొద్దిసేపు పీఠాధిపతులతో వైదిక పరమైన అంశాలను విపులంగా చర్చించారు.
మహావిద్యాపీఠంగా అవతరణ
జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ పీఠంగా ఆవిర్భవించిన విశాఖ శ్రీ శారదాపీఠం ఇపుడు మహా విద్యాపీఠంగా అవతరించిందని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి పేర్కొన్నారు. పీఠం నిర్వహణలో 21 సంవత్సరాల క్రితం ఏర్పా-టైన జగద్గురు శంకారాచార్య వేద పాఠశాల ఎందరో వేద పండితులను తీర్చిదిద్దిందని తెలిపారు. తమ పీఠ పరంపరకు 200ఏళ్ళ చరిత్ర ఉందని వివరించారు. హోళె నర్సిపూర్‌ కేంద్రంగా పరంపర మొదలైందని స్వాత్మానందేంద్ర తెలిపారు.
పాల్గొన్న మంత్రులు
వార్షిక మహోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్మోహన్‌ రెడ్డితో పాటు- పలువురు ప్రముఖులు పీఠానికి తరలివచ్చారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెరుకు శ్రీరంగనాధ రాజుతో పాటు- అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సవాల్లో పాల్గొని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. అంతకు ముందు విశాఖ విమానా శ్రయం వద్ద , శారదాపీఠం స్వాగత ద్వారం వద్ద ముఖ్యమంత్రికి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అభివాదం చేసి స్వాగతించారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని విశాఖ జిల్లా అధికార యంత్రాంగం శారదాపీఠంతో పాటు పలు ప్రాంతాల్లోనూ భారీగా ఏర్పాట్లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement