Friday, October 25, 2024

కాకతీయుల వైభవానికినిదర్శనం గణపేశ్వరాలయం

కాకతీయ రాజులు ప్రజాసంక్షేమం కోసం ఏపని తలపెట్టినా ప్రణాళికాబద్ధంగా ముందుచూపుతో చేసేవారు. నాడు చేసి పనులు శతాబ్దాలు గడిచినా అవి ఇంకా శాశ్వతంగా నిలిచి ఉన్నాయి. సుమారు 800 సంవత్సరాల ఘనచరిత్రను సొంతం చేసు కొని విశిష్టత సంతరించుకొన్న గణపేశ్వాలయం (కోటగుళ్ళు) జయశంకర్‌ జిల్లా గణపురం మండల కేంద్రంలో ఉంది. కాకతీయ రాజుల కళా వారసత్వం ఉట్టిపడే శిల్పకళా నైపుణ్యం, శైవ క్షేత్రంగా విరాజితుల్లుతున్న అపురూప కట్టడం గణపేశ్వరాలయం ఇది హనుమకొండ జిల్లాకు 72 కి.మీ, దూరాన రామప్ప దేవాలయానికి 9కి.మీ. దూరాన గణపురానికి ఈశాన్య ప్రాంతంలో ఉంది.
కాకతీయులు కట్టడాలలోకెల్లా తలమానికమైన ఈ కాకతీయ కళాక్షేత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ విధంగా ఒకే చోట ఇన్ని ఆలయాలను ఎక్కడా నిర్మించిన ఆధారాలు లేవు. అయితే ఆంధప్రదేశ్లోని అలంపూర్‌, కర్ణాటకలోని ఖకోల్లో ఈవిధంగా ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణాప్రదంలో ఉప ఆలయాలు ఉన్నాయి. నిరంతరం ప్రజాక్షేమం కోరే ఆ రాజు లు భక్తి, భుక్తి, ఆవాసా (నివాసా)లతో అనుభవం ద్వారా రాజ్యం సుసంపన్నమవుతుందని తెలుసుకుని ఆలయాలు నిర్మించి వారి పాలన పురోగతిని శిల్పాల ద్వారా శాశ్వతం చేశారు.
ఆకట్టుకునే అందమైన భంగిమలతో శిల్పాలు

గణపేశ్వరాలయంలో శిలలపై చెక్కిన శిల్పాలలో ఆకట్టుకునే అందమైన భంగిమలు నాటి కట్టుబొట్టుతో అప్పటి సంస్కృతులు ప్రతిబింబింపచేశారు. ఆలయ ముఖద్వారంపై శివ, విష్ణు దేవుళ్ళ విగ్రహాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నవరసాలు ఉట్టిపడే శిల్పకాంతల అందమైన భంగిమలు, సైనికుల వీరసం, దేవతల కరుణారస అభయముద్రలు ఆలయంలో నగ్నంగా కన్పించే శిల్పాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సకలకళా శోభితంగా అలరారే ఈ గుడిలోని నాట్య సుందరీమణుల సోయగం తదితర శిల్పాలు ఆలయంపై, గోడలపై మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవుడు పరిపాలన కాలంలో కాకతీయ సైన్యాధక్షుడు రేచర్ల రుద్రరెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడైన గణపతిరెడ్డి ఆధ్వర్యంలో 1234 జయనామ సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి గురువారం ప్రధాన గణపేశ్వరాయంతో పాటు పరివాహ ఆలయాలకు ప్రాణ ప్రతిష్ట జరిగినట్లు గతంలో లభించి న శాసనం ద్వారా వెల్లడైంది.
ఆలయ ప్రత్యేకతలు

గణపేశ్వరాలయం (కోటగుళ్ళ)లో ఉత్తరాన కాటేశ్వరాలయం, దక్షిణాన 60 స్తంభాలు గల సభా(నాట్య) మంటపం, మధ్యన ప్రధాన గణపేశ్వరాలయం చుట్టూ ఉన్న 22 ఉప ఆల యాలు ఈ మూడు ఆలయాలకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. తూర్పున మూడు, దక్షి ణాన నాలుగు, పడమర తొమ్మిది, ఉత్తరాన ఆరు ఈవిధంగా ఉన్న ఈ ఆలయాల సమూహం చూపరులకు కనువిందు కలిగించాయి. ఇవికాక మరో రెండు శిథిల ఆలయాల చుట్టూ 2,60,360 చదరపు అడుగుల చతురస్రాకారంగా మట్టికోట ఆలయాలను ఆనుకొని రక్షణగా రాతి కోటలున్నాయి. అందుకే ఈ ఆలయాలకు కోటగుళ్ళు అనిపేరు వచ్చింది. చుట్టూ చెక్కిన అద్భుతమైన అల్లికలు ఏనుగులు, హంసలబారులు, మదనికలు, నాడు వారు వేసిన రంగులు ఇంకా చెదరకుండా ఉండడమే కాకుండా నాగిని, గజకేసరి శిల్పం వంటి అద్భుతమైన శిల్పాలు ఒక్కొక్కటి ఊతకమ్మీలుగా స్తంభం మోస్తున్నట్లు సందర్శకులకు కను విందు చేస్తుంటాయి. ఈ గుళ్ళనిర్మాణం అచ్చం రామప్పగుడి శిల్ప నిర్మాణ శైలిని పోలి ఉన్న ది. ప్రధాన ఆలయం అధిష్టానం 5 అడుగుల 11 అంగుళాలు కాగా ఇందులో ప్రధాన దైవం గణపేశ్వరుడు(లింగం) రూపంలో పూజలందుకుంటున్నాయి. ఈ ఆలయంలో నాలుగు రకాల అధిష్టానాలు కనిపిస్తాయి. మొదటి వర్గపు ఆలయాల్లో గర్భగృహం అంతరాళం వరుసగా వుండి చతురస్రాకారపు ప్రణాళిక కల్గి ఉన్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ నిర్మి తమై ఉప ఆలయాలు ఈ కోవకు చెందినవే. రెండో రకం ఆలయాల్లో గర్భగృహం, అంత రాళం, సభామంటపం అనే విభాగాలతో దీర్ఘచతురస్రాకార ప్రణాళిక కన్పిస్తుంది. సాధార ణంగా ఈ ఆలయాల్లో ముఖ మంటపం నుండి సభా మంటపంలోకి ప్రవేశముంటుంది. ఘణపురం గ్రామం మధ్యలో నిర్మితమైన ఆలయం, కోటగుళ్ళకు ఆవలగా నిర్మితమైన ఆలయాలు ఈ కోవకు చెందినవే. ఈ ఆలయాలు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయి.
ప్రణాళికబద్ధంగా భుక్తి, భక్తి, ఆవాసం

కాకతీయుల పాలనకు చిహ్నంగా భుక్తి(తటాకం), భక్తి(ఆలయం), ఆవాస ప్రధాయకాలుగా నిలిచి గత వైభవానికి సాక్ష్యంగా మిగిలాయి. ఈ ప్రణాళికపైనే వారిక్కడ నిర్మాణాలు చేపట్ట డంతో గణపురానికి చరిత్రలో చెరగని ప్రాముఖ్యత కలిగింది. బహుముఖ ప్రతిభావంతులు వీరశైవులైన కాకతీయ వంశీయులు సర్వమతాలను ఆదరించి మత సామరస్యాన్ని చాటారు. కవిపండిత పోషకులైన ఆ రాజుల కళాహృదయానికి నిదర్శనంగా గణపురంలో సుమారు 800 సంవత్సరాల క్రితం అత్యద్భుతంగా సజీవ శిల్పసంపదతో నిర్మించిన గణపేశ్వరాలయ సమూహాలు గణపసముద్రం అలరారుతున్నాయి.
శివపంచాక్షరి స్మరణతో మార్మోగిన ఆలయం

ఈ ఆలయాల వైభవం సంతరించుకున్న రోజులలో ఓం శ్రీ గణపేశ్వరాయ నమ: ఓం నమ: శివాయ.. శంభో శంకర.. హరహర మహదేవ అంటూ భక్తజన సందోహంతో నిరంతరం మారుమ్రోగే శివపంచాక్షరి స్మరణతో నిత్య అభిషేకాది అర్చనలతో ఆ ప్రాంతం పులకించి పోయేది. ఆదిదేవున్ని దర్శించి పుణీతులయ్యేందుకు రోజూ వేలాదిమంది భక్తులు,రాజోద్యోగులు ప్రముఖుల తాకిడితో అలరారే ఆ ఆలయ శోభను చూసి మహ్మదీయులకు కన్నుకుట్టింది. గణపేశ్వరాలయంతో పాటు ఉత్త రాన గల కాటేశ్వరాలయంలో దేవుని దర్శించుకునేందుకు కోడికూత కన్నా ముందే లేచి ఆలయ వెనుక భాగానగల కోనేరులో భక్తులు స్నానాలు చేసి ఆది దేవుని అభిషేకంలో పాల్గొ నేవారు. ప్రస్తుతం ఈ కోనేరు శిథిలావ స్థలో ఉన్నది. ఆ ప్రతి రోజు ఉదయం ఆలయ మంటపంలో ఒక నర్తకి వాయిద్యాలతో తన బృందంతో ఆనవాయితీగా నాట్య ప్రదర్శనలు చేసేది. ఆ సందర్భంగా ఆమె చేసిన భగవన్నామ సంకీర్తన నటరాజుకు తృప్తి కలిగించేది. ఆలయానికి జరిగే దీపదూప నైవే ద్యాల కోసం చక్రవర్తి అప్పుడు 60 ఎకరాల భూమిని ఆలయ కైంకర్యం కోసం దానం ఇచ్చినందువల్ల దానిపై వచ్చే పంటల ఆదాయాన్ని నైవేద్యా నికి, అంగరంగ భోగాలకు వినియోగించేవారు. ప్రతీ సోమవారం, మహా శివరాత్రి పర్వదినాలలో కిక్కిరిసి భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానాలు నిర్వహించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం స్థానిక ఆలయ పరిరక్షణ కమిటీ నాగపురి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత 15 సంవత్సరాలుగా గణపేశ్వరుడు నిత్య పూజలందుకుంటున్నాడు. ప్రతి యేటా శివకళ్యాణం, శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.
2009 పురావస్తు శాఖవారు ఈ ఆలయాల ప్రాంగణంలో చేపట్టిన తవ్వకాలలో శివ, విష్ణు, సూర్యభగవానులు, మాచరల్దేవిలాంటి 12 సుందరమైన 10 అడుగుల దేవతల విగ్రహాలు బయటపడ్డాయి. ఇవి అమెరికాలోని చికాగో మ్యూజియంలో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement