Saturday, October 5, 2024

నేను… రామానుజదాసుడను!

ఒకానొక సందర్భంలో నేను ‘రామానుజ దాసుడను’ అని తనకు తాను రామానుజా చార్యులకు దాసుడని పేర్కొన్నారు శ్రీరంగనాథస్వామివారు. ఎందుకంటే రామా నుజులవారి భక్తికి ఎంతో పరవశులయ్యేవారు స్వామి. మహోన్నత భక్తులు… సమ తామూర్తి… మానవతావాది శ్రీ రామానుజాచార్యులు అంటే శ్రీరంగనాథస్వామికి అంత ఇష్టం…. అభిమానం. అందుకే రామానుజాచార్యుల నిర్యాణం అనంతరం ఆయన పార్థివ దేహాన్ని కూడా తన ఆలయంలోనే వుంచుకున్నారు రంగనాథస్వామి. రామానుజాచార్యు నికి రంగనాథస్వామి దాసుడిని అని పేర్కొన్న కథ ఒకటి శ్రీరంగంలో ప్రచారంలో వుంది.
కొన్ని శతాబ్దాల క్రితం కూడా శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో స్వా మివారి ప్రసాదానికి భక్తులు బారులు తీరి వుండేవారు. ప్రతీ రోజు ప్రసాదం కొరకు ఎదురు చూస్తూ బారులు తీరిన భక్తులలో ఒక పేద వైష్ణవుడు వుండేవాడు. ఆయన రోజూ వరుసలో అందరికంటే ముందు నిలబడేవాడు. ఆయన తన కోసమేకాక, తన ఆరుగురు కొడుకుల కొరకు కూడా ప్రసాదం తీసుకెళ్ళేవాడు. ఆలయ అధికారులు అంతమందికి ప్రసాదాన్ని ఒకే వ్యక్తికి ఇవ్వడం సరికాదని అనేవారు. ఆయన మాత్రం ప్రసాదం ఇవ్వమని పట్టుపట్టేవాడు. ఇలా రోజూ ఆలయ అధికారులకి అతనికి కొంత వాదులాట జరిగేది.
”ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే నీ వెనుక వున్న మిగిలిన భక్తులందరికి కొంచెమే ప్రసాదం లభిస్తుంది” అని ఆలయ అధికారులు ఆ వైష్ణవుడిని మందలించేవారు. అయినా కూడా ఆ పేద వైష్ణవుడు ”నా ఆరుగురు కొడుకులు ఆహారం లేక బక్క చిక్కిపోయారు, వారు ఆకలితో అలమటిస్తూ వుంటారు. నేను తీసుకువెళ్ళే ప్రసాదానికై ఎదురుచూస్తూ వుంటారు. కనుక మీరు ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు” అని ఆయన ప్రాధేయపడేవాడు.
ఒకరోజు రామానుజుల వారు వైష్ణవుడు ఆలయ అధికారులకు మధ్య జరుగుతున్న వాదోపవాదాలను చూసి అక్కడకు వచ్చారు. ”ఏమి జరిగింద”ని అడిగారు.
ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపించి రోజూ అధిక ప్రసాదం కావాలని ఆయ న గొడవ చేస్తున్నాడని తెలియచేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుడి దగ్గరకు వెళ్ళి ”నాయనా నీవు ఆలయములో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా” అని అడుగుతారు. దానికి ఆ వైష్ణవుడు-
”స్వామీ! నా బక్క చిక్కిన కొడుకులని మీరే చూడండి, రోజంతా వారికి సేవలు చేయడ ములోనే నాకు సమయం సరిపోతుంది, వీరిని వదిలేసి నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయ లేను. పైగా నేను వేదాలను గాని, దివ్య ప్రబంధములను గాని నేర్చుకోలేదు, అందువల్ల నేను ఆలయ సేవ కాలములలో కూడా ఏ కైంకర్యం చేయలేను, నాకు కొన్ని విష్ణు సహస్ర నామం లోని శ్లోకాలు తప్ప ఏమి రావు, నేనేమి చేయగలను.” అని బదులిచ్చాడు ఆ పేద వైష్ణవుడు.
”సరే నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పు” అన్నారు రామానుజులవారు.
ఆ వైష్ణవుడు ఎంతో ఇబ్బందిగా ”విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్‌ ప్రభు:, భూత కృత్‌ భూత భృత్‌..” అని ఆపేసి, ”నాకు అంతవరకే వచ్చు స్వామీ!” అని చెప్పాడు.
అతని ఇబ్బంది చూసి రామానుజులవారు ”సరే నీకు ‘భూత భృత్‌’ అనే భగవన్నామ ము తెలుసుకదా! ఆ నామాన్నే జపించు, ఇక నీకు ఇక్కడికి ఆహారార్థియై రావలసిన అవసరం ఉండదు” అని సెలవిచ్చారు.
ఆనాటి నుండి ఆ వైష్ణవుడు ఇంకెప్పుడూ కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపిం చలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలయింది. రోజూ రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా భాగం మాయమై పోతుంది. పంచడానికి కొంచెమే వుంటోంది. ఆలయంలో ప్రసాదం దొంగల బారిన పడు తుందేమో అని భద్రత పెంచారు కూడా. అయినా రంగనాథులకు సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోతున్నది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అనుమానం వస్తున్నది అందరికి. చివరకు రామానుజులకి ఈ సమస్య గురించి తెలియచేసా రు. ఆ పేద బ్రాహ్మణుణ్ణి పిలుచుకు రమ్మని రామానుజుల వారు మనుషులని పంపారు. వారు తిరిగి వచ్చి ఆయన ఆలయానికి దగ్గరగా వున్న తన పాత నివాసంలో ఉండటంలేదని తెలిపారు. ఆ తరువాత కూడా ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ సమాచారం తెలియలేదు.
కొంత కాలం తర్వాత, రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది (శ్రీరంగం దగ్గర కావేరి పాయ) దాటుతుండగా ఈ వైష్ణవుడు ”స్వామీ… స్వామీ” అని రామానుజులని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించాడు. రామానుజుల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసాడు. ఆయన కనుల నుండి ధారగా కన్నీరు రాసాగింది.
”స్వామీ! మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందచేస్తున్నాడు. అం దువల్ల నా పిల్లలు సరిపడినంత పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆల య అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేసా ను. నేను మీకు సదా కృతజ్ఞుడను. మీరు చెప్పిన విధంగా రోజూ నేను ”భూతభృతే నమ:” జపాన్ని చేస్తున్నాను.” అన్నాడు.
అతని మాటలు విన్న రామానుజులు ఆశ్చర్యచకితులయ్యారు. ”ఎవరా పిల్లవాడు? వాని పేరేమిటి?” అని అడిగారు.
”ఆ పిల్లవాడు తాను రామానుజాదాసుడనని చెప్పాడు స్వామీ” అన్నాడు వైష్ణవుడు. రామానుజాచార్యులవారికి అంతా అర్థమయింది. ‘భూత భృత్‌’ నామానికి అర్థం ‘సమస్త జీవుల’ని పోషించువాడు అని అర్థంకదా! రామానుజుల వారి ఆజ్ఞానుసారం ‘భూత భృత్‌’ను పఠించిన వైష్ణవుడి ఆకలి బాధలను తీర్చారు ఆ రంగనాథస్వామి.
ఇంతకీ ఆ బాలుడు ఇంకెవ్వరు సాక్షాత్‌ శ్రీరంగనాథుడే అని తెలుసుకున్నారు శ్రీరామా నుజాచార్యులు. బాలుడి రూపంలో రంగనాథుడి దర్శనం రోజూ పొందుతున్న ఆ వైష్ణవు డి అదృష్టానికి పరవశులయ్యారు రామానుజులవారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement