Saturday, September 28, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 25.

లభంతే బ్రహ్మనిర్వాణమ్‌
ఋషయ: క్షీణకల్మషా: |
ఛిన్నద్వైధా యతాత్మాన:
సర్వభూతహితే రతా: ||

తాత్పర్యము : అంతరంగమందే మనస్సు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు పరమైనవారును, సర్వజీవహితము కొరకే పనిచేయువారును, సర్వపాపదూరులైనవారును అగు ఋషులే బ్రహ్మనిర్వాణమును పొందుదురు.

భాష్యము : కేవలము కృష్ణ చైతన్య వంతుడే భగవంతున్ని పూర్తిగా ప్రేమించగలుగుతాడు. అందువలన అతడు పాపముల చేయడు. తత్కారణముగా అతనికి భగవంతుడైన శ్రీకృష్ణుడే సర్వమునకు మూల కారణమని, అన్నింటికీ యజమాని అని, ఆనందింప చేయవలసిన వ్యక్తి అని, అందరి శ్రేయోభిలాషి అని నిస్సంకోచముగా తెలుసుకుంటాడు. ఇటువంటి అవగాహన లేక పోవుట వలననే ప్రజలు స్వార్థ ఆనందముకై ప్రయత్నిస్తూ అనేక కష్టాలను అనుభవి స్తున్నారని గుర్తించి, తాను పూర్తిగా భగవంతుని సేవకే అంకితమై ముక్త స్థితిలో నిలుచుట ద్వారా సర్వ మానవాళికి అత్యుత్తమ మేలు చేసిన వాడవుతాడు. భౌతిక సహాయాలు, మానవ సేవ ద్వారా మనస్సుకు, శరీరానికి కొంత ఊరట కలిగించినా అవి సంతృప్తిని ఇవ్వలేవు. మన ఈ జీవన సంఘర్షణకు కారణం భగవంతునితో మనకు గల సంబంధాన్ని మరిచిపోవటయే. దాన్ని పునరుద్ధరించుకున్న వాడే జీవన్ముక్తుడు కాగలడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement