Cricket |భారత్ టర్ఫ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..

Cricket | భారత్ టర్ఫ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..
20 జట్లతో ఉత్సాహంగా పోటీలు
క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపు
Cricket | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలోని ఎన్టీఆర్ కాలనీలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఖేలో భారత్ టర్ఫ్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ప్రారంభమైంది. నగరంలోని వివిధ విద్యా సంస్థల నుండి మొత్తం 20 జట్లు ఈ పోటీల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాయి. కార్యక్రమానికి ఖేలో ఇండియా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని ముఖ్య అతిథిగా హాజరయ్యి టాస్ వేసి టోర్నమెంట్ను ప్రారంభించారు.
అనంతరం పోటీలో పాల్గొంటున్న రెండు జట్ల ఆటగాళ్లతో కరచాలనం చేసి క్రీడలను కేవలం గెలుపు కోసం కాకుండా క్రీడాస్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ కాకాని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ ఖేలో ఇండియా వంటి పథకాల ద్వారా యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు యువతకు అవకాశాలు కల్పించడం వల్ల దేశంలో క్రీడా సంస్కృతి మరింత బలపడుతోందని తెలిపారు.

కార్యక్రమంలో ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి గోపి, నగర జనరల్ సెక్రటరీ మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ కాకానిని మొమెంటో అందజేసి సత్కరించారు. యువ నాయకులు క్రీడలు, వ్యవస్థాపకత రంగాల్లో యువతను ప్రోత్సహించడం అవసరమని వారు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్కు అమరావతి బోటింగ్ క్లబ్ మొమెంటోలను స్పాన్సర్గా అందించగా, నిర్వాహకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. పోటీలు ముగిసే వరకు విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడా వాతావరణాన్ని సృష్టించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.





